Hyderabad : ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఈ పేరు తెలీని వాళ్లు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్. అలాంటి ప్రముఖ మానసిక ఆస్పత్రిలో అనుకోని విషాదం జరిగింది. ఫుడ్ పాయిజన్ అయింది. 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై విచారణ జరుగుతోంది.
ఆ విందు వల్లే..
ఇటీవల ఎర్రగడ్డ మానసిన వైద్యశాలతో ఓ కార్యక్రమం సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి సహాయకులు అంతా ఆ భోజనం చేశారు. కాసేపటికే చాలామందికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే వారికి చికిత్స ప్రారంభించారు. ఏకంగా 70 మందికి ఫుడ్ పాయిజన్ అయినట్టు గుర్తించారు. తీవ్ర అస్వస్థతో కిరణ్ అనే మానసిక రోగి చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మిగిలిన వారికి ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య బృందం వారికి చికిత్స అందిస్తోంది.
ఫుడ్ పాయిజన్పై ఎంక్వైరీ
ఘటనపై ఆస్పత్రి సూపరిండెంటెంట్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? విందులో ఎలాంటి ఆహారం వడ్డించారు? కలుషిత నీరు తాగారా? వంటి వాటిపై చర్చించారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్సెట్టి హాస్పిటల్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సైతం ఆసుపత్రికి వచ్చారు. వాటర్ వర్క్స్ అధికారులు సైతం హాస్పిటల్ వచ్చి మంచినీటి కలుషితంపై పరీక్షలు చేస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సా సెంటర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.