CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్లుండి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో తలపడనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేవలం పాలకుడిగానే కాకుండా.. క్రీడాకారుడిగానూ సీఎం తన ఉత్సాహాన్ని చాటుతున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర ఫుట్బాల్ జట్టు సభ్యులతో కలిసి సీఎం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ఆటగాడితో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన మ్యాచ్ను సీఎం రేవంత్ రెడ్డి సవాల్గా తీసుకున్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ప్రాక్టీస్లో ముఖ్యమంత్రి ఫీల్డ్లో చురుగ్గా కనిపించారు. ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్లతో కలిసి పాసింగ్ డ్రిల్స్, డిఫెన్స్ వ్యూహాలు గోల్ షాట్ ప్రాక్టీస్ చేశారు. మెస్సీకి ఉన్న అంతర్జాతీయ అనుభవం నేపథ్యంలో.. ఆ స్థాయిలో ఆడటానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఆటగాళ్లను ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి స్వయంగా డిఫెండర్గా, కొన్నిసార్లు ఫార్వర్డ్గా ఆడుతూ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఈ ప్రాక్టీస్ సెషన్ కేవలం శారీరక శిక్షణకే కాకుండా జట్టు సభ్యులలో మానసిక స్థైర్యాన్ని పెంచింది. ప్రాక్టీస్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మెస్సీ మన దేశానికి రావడం మనందరికీ గర్వకారణం. ఈ మ్యాచ్ ఫలితం కంటే, ప్రపంచ స్థాయి ఆటగాడితో ఆడే అనుభవం మన రాష్ట్ర యువ ఆటగాళ్లకు చాలా ముఖ్యం. వారంతా ధైర్యంగా ఆడాలి’ అని అన్నారు. ఆయన మాటలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.
ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ద్వారా రాష్ట్రంలో ఫుట్బాల్కు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. ముఖ్యమంత్రి స్వయంగా ప్రాక్టీస్లో పాల్గొనడం పట్ల క్రీడా పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లుండి జరగబోయే ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.