Forest Officers: స్వేచ్ఛ బ్యూరో: అటవీశాఖ అధికారులకు ఆయుధాలు.. వాహనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బీట్ ఆఫీసర్ వేల కిలోమీటర్లు పరిధి ఉండటం, వాటిలో పర్యవేక్షణకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఖాళీ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతుంది. దీనికి తోడు మహిళా ఆఫీసర్లకు సైతం కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఫారెస్టు సిబ్బందిపై దాడులను పరిగణలోకి తీసుకొని ఆయుధాలు ఇస్తే రక్షణ ఉంటుంది. అయితే ప్రభుత్వం సైతంఇస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్న ముందుకు సాగకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతి ఏటా వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏక్ ఫేడ్ మాకే నామ్ అనే కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. అందులో భాగంగానే అటవీ రక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కానీ అధికారుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. పనిచేస్తున్న బీట్ ఆఫీసర్లు (ఎఫ్బీఓలు), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల (ఎఫ్ఎస్ఓలు)లకు సైతం వాహనాల కొరత ఉంది. అంతేకాదు పర్యటన సమయంలో ఆయుధాలు సైతం లేకపోవడంతో అటవుల ఆక్రమణ సమయంలో ప్రతిఘటించే సమయంలో గాయపడుతున్న సంఘటనలు ఉన్నాయి. మరోవైపు కలప స్మగ్లర్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయుధాలు సైతం ఇస్తామని ప్రకటన సైతం చేసింది. కానీ ఇంకా ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ఒక్కో బీట్ పరిధి సగటున 2,000 నుంచి 4,000 హెక్టార్ల వరకు ఉందని సమాచారం. ఈ విస్తీర్ణంణంపై నిత్యం పర్యవేక్షణ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఉన్నతాధికారులకు వాహనాలు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే బీట్ ఆఫీసర్లకు మాత్రం మోటార్ సైకిళ్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 2347 మంది విధులు నిర్వహిస్తుండగా, ఎఫ్ఎస్ఓలు సైతం 998 మంది పనిచేస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది వాహనాలు లేవని సమాచారం. దీంతో చేసేదేమీ లేక సొంత బైకులపై అడవిలో తిరుగుతూ పర్యవేక్షణ చేయాల్సి వస్తుందని ఓ బీట్ ఆఫీసర్ తెలిపారు. గతంలో బైక్లు కొనుగోలు చేసినా అవి సిబ్బందికి సరిపడా లేవని తెలిసింది. దీనికి తోడు ప్రథమ చికిత్సకు సైతం సరైన మెడికల్ కిట్లు లేవని, అడవి లోపలికి వెళ్తే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతోందని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అధికారులకు సమాచారం ఇచ్చేందుకు ఇచ్చిన వాకీటాకీలు కూడా పని చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఇంట్లో ఫ్రిజ్ లేకున్నా కొత్తిమీర, పుదీనా 15 రోజులు ఫ్రెష్గా ఉంటుంది.. ఈ వేసవి చిట్కాలు తెలుసా
దీనికి తోడు పోలీసు శాఖ తర్వాత ఎక్కువగా ఫారెస్టు శాఖలో మహిళలు పనిచేస్తున్నారు. సుమారు 30శాతం వరకు మహిళా బీట్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2347మంది బీట్ ఆఫీసర్లు పనిచేస్తుండగా ఇందులో 995 మంది మహిళలే ఉన్నారు. వీరికి ఉద్యోగ నిర్వహణ సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఆయుధాలు లేకుండా ఒంటరిగా అడవిలోకి వెళ్లాలంటేనే జంకుతున్నట్లు సమాచారం. అడవుల్లో గస్తీ నిర్వహించే మహిళా అధికారులకు కనీసం టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం ఉండటం లేదని సమాచారం. చాలాచోట్ల బీట్ క్వార్టర్లు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. క్షేత్రస్థాయిలో నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో.. వారు సమీప గ్రామాల్లోనే కిరాయి ఇళ్లలో ఉంటూ ప్రతిరోజూ కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో తనిఖీలకు వెళ్లాలంటే ఆయుధాలు లేక మహిళా అధికారులకు సరైన రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీఠాణాల ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ అవి ముందుకు సాగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2022 నవంబర్ 22న చండ్రుగొండ మండలంలో పోడు భూముల దారులు చేసిన దాడిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందడంతో దానిని సీరియస్ గా తీసుకొని పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావించింది. కానీ ముందుకు సాగడం లేదు. దీంతో పారెస్టు అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవి ఏర్పాటు చేస్తే సిబ్బందికి ఆయుధాలతో పాటు రక్షణ ఏర్పడనుంది.
అటవీశాఖలో అన్ని విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న అధికారులు, సిబ్బందిపై అదనపు భారం పడుతుంది. దీంతో సెలవులు సైతం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీట్ ఆఫీసర్లు మొత్తం 3,652 మంది ఉండాల్సి ఉండగా.. 2,347 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1305 వరకు బీట్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 1800 మంజూరు కాగా ఇందులో దాదాపు 900 మంది పనిచేస్తున్నారని, 900 వరకు ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. సెక్షన్ ఆఫీసర్లు(మినిస్టీరియల్ స్ట్రెంత్) 1032 మంది ఉండాల్సి ఉండగా, 858 మంది మాత్రమే విధులు నిర్వరిస్తున్నారు. మంది విధులు నిర్వర్తిస్తున్నారని, 174 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఎఫ్ఎస్ఓలు 1047 మంది ఉండాల్సి ఉండగా 998 మంది పనిచేస్తున్నారు. మరో 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కొంతకాలంగా భర్తీకి నోచుకోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read: Kadapa: కడపలో విషాదం.. షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి