HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జే. దొర (హన్మంతు జ్యోతి దొర) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన దొర పోలీసు విభాగంలో సుమారు 40 ఏళ్ల పాటు విశేష సేవలందించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆయన ఉమ్మడి రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కీలక మైలురాళ్లను అధిగమించారు. మొదట అడిషనల్ డీజీపీగా అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు.
పోలీసు అధికారిగా దొర ప్రస్థానం అత్యంత సాహసోపేతంగా సాగింది. ముఖ్యంగా 1993లో పీపుల్స్ వార్ గ్రూపు లక్ష్యంగా చేసుకున్న 40 మంది కీలక పోలీసు అధికారుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్న కాలంలో ఆయన ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఆయన సేవలు విస్తరించాయి. 2002లో కేంద్ర సర్వీసులకు వెళ్లిన దొర ఢిల్లీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. భారత విజిలెన్స్ కమిషనర్గా కూడా నియమితులై అత్యున్నత స్థాయిలో సేవలందించారు.
వృత్తిపరమైన బాధ్యతలతో పాటు క్రీడారంగం పట్ల దొరకు అమితమైన ఆసక్తి ఉండేది. ఇండియన్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుండేవారు. 2006 కామన్వెల్త్ గేమ్స్కు భారత బృందానికి ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరించి క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు. పోలీసు శాఖలో ఆయన కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్ను అందుకున్నారు. అలాగే శౌర్యపతాకం (Police Medal for Gallantry) కూడా దొరను వరించింది.
ఒక నిజాయితీ గల అధికారిగా నిరంతరం ప్రజాసేవలో గడిపిన హెచ్.జే. దొర మృతి పట్ల పోలీసు యంత్రాంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు రంగానికి తీరని లోటుగా పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఆయన భౌతికకాయానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ కమిషనర్ వి సి సజ్జనర్, మాజీ పోలీసు అధికారులు నివాళులర్పించారు.
Read Also: సినిమా టికెట్ పెంపుపై ట్విస్ట్.. తెలంగాణ హైకోర్టు ఆదేశాన్ని నిలిపిన సుప్రీంకోర్టు