Phone Tapping Case: బీఆర్ఎస్ కీలక నేతలకు కొత్త టెన్షన్ మొదలైందా? పార్టీలో ఫ్యామిలీ విబేధాలు రచ్చకెక్కాయా? తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ పార్టీని కలవరపెడుతోందా? ఐదున సిట్ ముందు మాజీ ఐపీఎస్ ప్రభాకర్రావు వస్తారన్న వార్తలతో కొత్త టెన్షన్ మొదలైందా? ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు? ఈ ఏడాదీ కారుకి కష్టాలు తప్పవా? అవుననే అంటున్నారు.
ఏపీలో జగన్ మాదిరిగా తెలంగాణలో అధికారులు ఏ కేసు పట్టుకున్నా నేరుగా ఎర్రవెల్లి ఫామ్హౌస్కి కనెక్ట్ అవుతోంది. ఎట్టకేలకు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు క్లయిమాక్స్కి చేరింది. దర్యాప్తు చివరి దశకు చేరుకోవడంతో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఈ నెల 5న అంటే గురువారం సిట్ ముందుకు రానున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు ఈ సమాచారం అందింది.
అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు పత్రాలు సమర్పించాడు. ఆయనను అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్కు ఈ వారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్టు కోసం ఆయన రెండు రోజులుగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించారు. పాస్పోర్ట్ అందిన తర్వాత మూడు రోజుల్లో సిట్ ముందు హాజరుకానున్నారు.
ఈ క్రమంలో ఇండియా వచ్చేందుకు ఆయన తన ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా రెండు రోజుల్లోగా సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతేడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయ్యింది. గంటల వ్యవధిలో ప్రభాకర్రావు అమెరికాకు పారిపోయాడు.
ALSO READ: మిస్ వరల్డ్-2025 టైటిల్ గెలుచుకున్న థాయ్ సుందరి
14 నెలలుగా అమెరికాలో తలదాచుకున్నాడు ప్రభాకర్రావు. పాస్పోర్టు రద్దు, వీసా గడువు ముగియడంతోపాటు రెడ్కార్నర్ నోటీస్ జారీ అయ్యింది. హైదరాబాద్ పోలీసులు కేంద్రంతోపాటు అమెరికా అధికారులతో నిత్యం టచ్లో ఉండడంతో ఆయన రాక మరింత సులభమైంది. తొలుత క్యాన్సర్ చికిత్స కోసం యూఎస్ వెళ్లినట్టు న్యాయస్థానాల్లో అఫిడవిట్ దాఖలు చేశాడు.
ఇండియాకు రాకుండా శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు తన బుర్రకు పదునుపట్టారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. విదేశీయులను తమ దేశాలకు పంపాలన్న ట్రంప్ సర్కార్ నిర్ణయం కూడా ప్రభాకర్రావు రావడానికి కారణమైందని అంటున్నారు.
ఇదే కేసులో మాజీ పోలీసులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులకు బెయిల్ మంజూరు కావడంతో పరిస్థితి గమనించిన ప్రభాకర్రావు న్యాయస్థానం గడపఎక్కారు. ఆయనకు ముందుస్తు బెయిల్ ఇవ్వలేదు కానీ, కాకపోతే కొంత రిలీఫ్ మాత్రం ఇచ్చింది. ప్రభాకర్రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్ను ఆదేశించింది సుప్రీంకోర్టు.
ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆగస్టు 5న విచారణ జరపనుంది. ప్రభాకర్రావు విదేశాల నుంచి వస్తున్న విషయం తెలియగానే బీఆర్ఎస్ కీలక నేతలకు వణుకు మొదలైంది. ఈ కేసులో తమను ఎక్కడ ఇరికిస్తారేమోనని బెంబేలు ఎత్తుతున్నారు. విచారణలో ప్రభాకర్రావు ఎవరి పేరు చెబుతారో? కేసు నుంచి తప్పించుకునేందుకు అప్పటి పెద్దలను ఇరికిస్తారా? అనేది తేలనుంది.