Sudheer Reddy: స్వేఛ్చ బ్యూరో: మేడ్చల్ నియోజకవర్గంలో తీవ్రంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.నిజంగా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే, పదవులు-ప్రభావం ఉపయోగించి లేదా సొంత నిధులు ఖర్చు చేసి అయినా ప్రజలకు నీరు అందించాల్సిన బాధ్యత మల్లారెడ్డిపై ఉందన్నారు. కానీ ప్రజల దాహాన్ని పట్టించుకోకుండా రాజకీయ స్వార్థమే ప్రధానంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మంగళవారం మేడ్చల్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎల్లంపేట్ మున్సిపల్లో 24 వార్డులకు గాను 18 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంటుందని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారమ్లు ఇచ్చామని, నాయకులు-కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలు కాంగ్రెస్వే అవుతాయని తెలిపారు.పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, ఎవరు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Yumnam Khemchand: మణిపూర్లో ముగిసిన రాష్ట్రపతి పాలన.. నూతన ముఖ్యమంత్రిగా యమ్నం కెంచంద్!
గత ప్రభుత్వ పాలనలో ప్రజలు దోపిడికి గురయ్యారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేశారని ఆరోపించారు. అప్పుల భారంతో కుంగిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.మున్సిపల్ ఎన్నికల పోటీ పూర్తిగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే ఉంటుందని, ఇతర పార్టీలకు ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించారు.
డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేసే రాజకీయాలకు కాంగ్రెస్కు పొంతన లేదని, వ్యాపార ప్రయోజనాల కోసమే మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. పైప్లైన్ సమస్య కారణంగానే ప్రస్తుతం నీటి ఇబ్బందులు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలిపారు.ఈ సమావేశంలో మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గౌడవెల్లి మాజీ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు గువ్వ రవి, మాజీ కౌన్సిలర్ కౌడ మహేష్, నాయకులు శివశంకర్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gadwal Municipality: మున్సిపల్ నామినేషన్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వర్గీయుల హైడ్రామా..!