Gadwal Municipality: స్వేఛ్చ బ్యూరో: గద్వాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత మద్య గత కొంతకాలంగా తమ వర్గీయులకు టికెట్ల కేటాయింపు పై అధిష్టానంతో పాటు మునిసిపల్ ఎన్నికల ఇన్చార్జి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో సుదీర్ఘ చర్చలు జరిగాయి. మొదటినుంచి 37 వార్డులకు తమకే దక్కుతాయని ఎమ్మెల్యే అనుచరులు చేసుకున్న ప్రచారం కు తగ్గట్టే నామినేషన్ల ఉపసంహరణ రోజు సైతం హైడ్రామా మధ్య ఎమ్మెల్యే వర్గీయులే అధికారులకు బి ఫామ్ లు అందజేశారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ముఖ్య నాయకుల డ్రామాల మద్య సరిత వర్గీయులకు నిరాశ ఎదురయింది. అధిష్టానం ఇద్దరి నేతలతో మాట్లాడి ఓ వర్గానికి 30, మరో వర్గానికి 7 వార్డులు ఇస్తారంటూ వచ్చిన వార్తలు పుకార్లుగా కనిపిస్తోంది. తీరా మున్సిపల్ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో 37 వార్డులకు సంబందించిన భీఫాంలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బలపరిచిన అభ్యర్థులకు అందజేసినట్లు మీడియాకు తెలపడంతో మాజీ జడ్పీచైర్ పర్సన్ సరిత వర్గీయుల ఆందోళన మొదలైంది.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాదని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గీయులకు అందజేశారని నమ్మించి మోసం చేశారని సరిత వర్గీయులు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా టిక్కెట్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో మాజీ జెడ్పీ సరిత వర్గీయులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంజిపేట శంకర్ ప్రభుత్వ పెద్దలతో బీఫామ్ కేటాయింపుపై విన్నవించగా ఎట్టకేలకు ఆయనకు మాత్రమే టికెట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెన్నంటి ఉండి కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించే కురుమన్నకు అప్పటికే బీఫామ్ విషయమై హామీ మేరకు ప్రచారం నిర్వహించుకుంటుండగా రాజకీయ సమీకరణల కారణంగా ఆయనను పోటీ నుంచి తప్పించాల్సి వచ్చింది.
Also Read: Chinese Oils: ఈ చైనా నూనెలు వాడారంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగేస్తుందట
మొదట డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి చెందిన 37మంది కాంగ్రెస్ అభ్యర్థులకు భీఫామ్ లు అందజేశారు. ఆ తర్వాత మాజీ జడ్పీచైర్ పర్సన్ సరిత వర్గానికి 7 వార్డులకు సంబంధించిన అభ్యర్థులకు భీఫాంలు అందజేశారు. మంగళవారం ఉదయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి చెందిన 37 మంది అభ్యర్థులు తమ భీఫాంలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మంగళవారం ఉపసంహరణతో పాటు ఆయా పార్టీల భీఫామ్ లు సమర్పించేందకు మంగళవారం మద్యాహ్నం మూడు గంటలకు ఆఖరి రోజు కావడంతో గద్వాల మున్సిపాలిటి వద్ద నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతో పాటు నాయకుల్లో గందరగోళం మొదలైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం మొదట బీఫాంలు సమర్పించిన వారికే కాంగ్రెస్ పార్టీ గుర్తు కేటాయిస్తారు. అంతే కాకుండా బీఫాంలతో పాటు సీ ఫాంలు తప్పనిసరిగా సమర్పించడం కీలకం కావడంతో.. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గీయుల వార్డు అభ్యర్థులు సమర్పించిన బీఫాంలు చెల్లవని తేలడంతో సరిత వర్గీయుల ఆశలు అడియాసలు అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీఫాంలు అందవని తెలిసిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గీయులకు 7 వార్డులకు సంబంధించి బీఫాంలు అందజేశారు. అప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల బలపరిచిన 37వార్డుల అభ్యర్థులకు భీఫాంలు అందజేయడంతో వారు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత సరిత బలపరిచిన అభ్యర్థుల్లో 8,10,11,12,14, 29,36 వార్డుల అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. వారిలో 11 వ వార్డు అభ్యర్థి తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తలేమంటూ.. నామినేషన్ ఉపసహరించుకున్నారు. మిగత వార్డు అభ్యర్థులు కూడా బీఫాంలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఇందులో 14వ వార్డు అభ్యర్థి శంకర్ తప్ప మిగతా 5మంది బీఫాంలు చెల్లవని తేలడంతో.. చెల్లని బీఫాంలు ఎందుకు అందజేశారని డీసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ డబుల్ బీఫాంలు ఎందుకు అందజేశారని, అవగాహన ఉండి చేశారా లేక అన్నీ తెలిసి చెల్లని బీఫాంలు అందజేసి మమ్మల్మి నమ్మించి మోసం చేశారా అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.