House Burglary: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఇంట్లో దొంగలు పడ్డారు. కోటిన్నర రూపాయల నగదును తస్కరించి ఉడాయించారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ దొంగతనం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి సనత్ నగర్ ప్రాంతంలోని జెడ్ కాలనీలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని అవకాశంగా చూసుకున్న దొంగలు లోపలికి చొరబడ్డారు. ఐరన్ సేఫ్ లో భద్రపరిచిన కోటిన్నర రూపాయల నగదు, ఇతర విలువైన సొత్తును తస్కరించి ఉడాయించారు.
ఆదివారం ఉదయం వచ్చిన సురేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు. తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Also Read: జలమండలి ఫలితమే దిక్సూచి.. జీహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్