Indiramma Towers: హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ టవర్స్’ ఇళ్ల కేటాయింపు పేర సైబర్ మోసాలు జరిగే అవకాశముందని హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లబ్ధిదారుల నుంచి రూ.10 వేల రూపాయల ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) తీసుకునే చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింకులతో బురిడీ కొట్టించే ప్రమాదముందన్నారు.
ఈ పథకంలో దళారులు లేదా మధ్యవర్తులకు తావులేదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండీ సొమ్ము భద్రంగా ఉంటుందన్నారు. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని వివరించారు. డబ్బులు చెల్లిస్తే ఇల్లు కచ్చితంగా ఇప్పిస్తామని చెప్పేవారి మాటలు నమ్మవద్దని సూచించారు.
‘ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది’ అని భయపెట్టి, తొందరపాటులో నగదు బదిలీ చేయించుకోవడం నేరగాళ్ల ప్రధాన ఎత్తుగడ అని సీపీ హెచ్చరించారు. వాట్సాప్ లేదా మెసేజ్ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మి ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని తెలిపారు.
అలాగే ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టించి మోసగించే అవకాశం ఉందని సజ్జనార్ అన్నారు. గైడ్ చేస్తామనే నెపంతో ఎనీడెస్క్, టీమ్వ్యూయర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను డౌన్లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేస్తారని పేర్కొన్నారు. యూపీఐ పిన్ అనేది కేవలం డబ్బులు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రీఫండ్ సొమ్మును స్వీకరించడానికి పిన్ నంబర్ నొక్కాల్సిన అవసరం లేదనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలన్నారు.
Also Read: అంబటితో వేదిక పంచుకున్న బోండా ఉమా.. చంద్రబాబు రియాక్షన్ చూస్తే మైండ్ బ్లాకే!
అపరిచిత వ్యక్తులకు ఆధార్ కార్డుల ఫొటోలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు పంపకూడదని సజ్జనార్ సూచించారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘040-24603572’ అనే హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసేందుకు 1930 ఉచిత హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read: పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!