Mahesh Kumar Goud: స్వేచ్ఛ బ్యూరో: జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు కార్మికులు, ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన మొగుళ్ల రాజిరెడ్డికి ఆదివారం గాంధీభవన్ లో అభినందన సభ నిర్వహించారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జలమండలి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో పాల్గొని, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ కు ఓటు వేసి గెలిపించిన కార్మిక సోదరిసోదరులందరికీ అభినందనలు తెలిపారు. జలమండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన మొగుళ్ల రాజిరెడ్డికి వారి బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఐఎన్టీయూసీ ద్వారా కాంగ్రెస్ జెండాను ఎగరేశామని, రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయపతాకం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ పాలనలో ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులపై ఫైర్
కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూడు రోజుల్లోనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారని పేర్కొన్నారు. సింగరేణి, జలమండలి వంటి సంస్థలను బీఆర్ ఎస్ నాయకులు తమ గుప్పిట్లో పెట్టుకుని కార్మికులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ముఖ్యంగా జలమండలిపై హరీష్ రావు ఆధిపత్యం కొనసాగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించి తమ నాయకులను ఎన్నుకున్నారని తెలిపారు. కార్మికుల కష్టసుఖాల్లో అండగా నిలవాలని మొగుళ్ల రాజిరెడ్డి బృందానికి సూచించారు.
మహేష్ కుమార్ గౌడ్ హామి
ఐఎన్టీయూసీ అనుబంధ టీజేఈయూ విజయానికి సంజీవ రెడ్డి చేసిన కృషి విశేషమని కొనియాడారు. కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జలమండలి ఎన్నికల్లో సాధించిన విజయం కార్మికుల ఆత్మగౌరవానికి, కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కార్మిక సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తుందని మహేష్ గౌడ్ తెలిపారు. మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేక కృతజ్ఞతలు
జలమండలిలో పన్నేండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ఐఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘం(తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్) ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. జలమండలి కారికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
సభలో పాల్గొన్న అధికారులు
ఈ సభలో ఐఎన్టీయూసీ ఇంచార్జి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి. చంద్రశేఖర్, వై. నాగన్న గౌడ్, అదిల్ షరీఫ్ , టి.జె.ఈ.యు ప్రధాన కార్యదర్శి కె. రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రావణ్ కుమార్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు కె.రాజి రెడ్డి, నేతలు ఈ.చంద్రశేఖర్, ఎం.రాజా, బి.శంకర్ ప్రకాష్, బి.నర్సింగ్ రావు,కె.ఆనంద్ రెడ్డి, అజయ్ నాథ్, వినోద్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, సైద్ హాసిం, ఇందూరి తిరుపతి, గౌస్ పాషా, బి.అశోక్, ఏ.అశోక్, మొగులయ్య, రవీందర్,లక్ష్మణ్ యాదవ్, ఆర్.వెంకటేష్, షేర్ బహదూర్,సాయిలు, శ్యామ్, అబ్దుల్ రవూఫ్, ప్రవీణ్ కుమార్, బి.మహేష్, వేణు, రంగయ్య, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: పాఠశాలల విద్యార్థులకు కలిసొచ్చింది.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే..