Bus Shelters: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్టాపుల్లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులకు మెరుగైన సేవలంటూ జీహెచ్ఎంసీ సిటిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్లు నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయి. ఫలితంగా ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో ఎదురుచూపులు చూడాల్సి వస్తుందని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ మినహా మిగలిన అయిదు జోన్లలో తొలి దశగా 16 ఏసీ బస్ షెల్టర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కొన్నింటిలో లైట్లు వెలగకపోగా, మరి కొన్నింటిలో ఏసీ పని చేయకపోవటం, ఇంకా కొన్ని అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి.
ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసు సమీపంలోని ఏసీ బస్ షెల్టర్ రాత్రి పూట మందుబాబులకు అడ్డా మారటంతో పాటు, ఇంకొందరు వాటిని కబ్జా చేసుకుని ఏకంగా షాపులుగా మార్చుకున్నారు. జీహెచ్ఎంసీ తొలి దశగా ఖైరతాబాద్ జోన్ లోని ఖైరతాబాద్, మెహిదీపట్నం, ఎస్ ఆర్ నగర్, కోఠి ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేయగా, కూకట్ పల్లి జోన్ లోని కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, ప్లాటినమ్ మాల్ ల వద్ద, అలాగే సికిందరాబాద్ జోన్ పరిధిలోని సికిందరాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు శివమ్ రోడ్డు, తార్నాక, బేగంపేట ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటితో పాటు చార్మినార్ జోన్ పరిధిలోని ఆరంఘర్ తో పాటు దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉన్నందున మరో రెండు ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు.
Also read: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా!
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణ బాధ్యతలను అయిదు బడా అడ్వర్ టైజ్ మెంట్ ఏజెన్సీలకు అప్పగించారు. కానీ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి కూడా లోపాలను గుర్తించిన జీహెచ్ఎంసీ పూర్ మెుయింటనెన్స్ అంటూ ఏజెన్సీలకు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నా, సదరు యాడ్ ఏజెన్సీలు స్పందించటం లేదని తెల్సింది. ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని తెల్సింది. త్వరలో మరోసారి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఫైనల్ నోటీసులకు స్పందించని పక్షంలో నిర్వహణ బాధ్యతల నుంచి ఆ ఏజెన్సీలను తొలగించి, కొత్త ఏజెన్సీలను నియమించే యోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు. కొత్తగా నియమించనున్న యాడ్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలను రానున్న 15 ఏళ్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ మహా నగరంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు తోడు రద్దీ, ట్రాఫిక్ కూడా పెరుగుతుండటంతో, సిటీలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సర్కారు అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ మెట్రోరైలు మూడు కారిడార్లలోని 69 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ఏర్పాటుతో కనుమరుగైన సుమారు 360 బస్ షెల్టర్లకు ప్రత్యామ్నాయంగా త్వరలోనే మరో 300 బస్ షెల్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ స్థలాలను గుర్తించినట్లు సమాచారం. వీటిలో కొన్ని బస్ షెల్టర్లకు స్థలాలిచ్చేందుకు కొన్ని స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ శాఖలు ససే మిరా అంటున్నట్లు తెలిసింది. ఆయా సంస్థల హెచ్ఓడీలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెల్సింది. చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత బస్ షెల్టర్ల పనులు మొదలుకానున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 1250 బస్ షెల్టర్ల తో కలుపుకుని మొత్తం బస్ షెల్టర్ల సంఖ్య 1550 కు పెరగనుంది.
Also read: బంధం చెరువును చంపేస్తున్న అధికారయంత్రాంగం.. ఇప్పటికైనా స్పందిస్తారా..!