TG Education Reforms: విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించింది. క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్కూల్ డిస్ట్రిక్ట్ ల ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులపై సంచలన సూచనలు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను పటిష్టం చేసేందుకు తెలంగాణ విద్యా కమిషన్ వినూత్న ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. పరిపాలనా సౌలభ్యం, విద్యా నాణ్యత పెంపు, సిబ్బంది నియామకం, మౌలిక వసతులు, నాణ్యతా చర్యల పర్యవేక్షణే ధ్యేయంగా స్కూల్ డిస్ట్రిక్ట్ విధానాన్ని తీసుకురావాలని నివేదికలో సూచించింది.
ప్రతి స్కూల్ డిస్ట్రిక్ట్కు కలెక్టర్ చైర్మన్గా ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని కమిషన్ పేర్కొంది. దీనివల్ల స్థానికంగా పాఠశాలల అవసరాలు, వసతుల కల్పనపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. జనాభా, పాఠశాలల సంఖ్యను బట్టి స్కూల్ డిస్ట్రిక్ట్ల సంఖ్యను కమిషన్ ఖరారు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధిక విద్యార్థుల సాంద్రత కలిగి ఉంది. అందుకే ఈ మూడు జిల్లాల్లో ఒక్కో జిల్లాకు మూడు చొప్పున స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మిగిలిన జిల్లాల్లో ప్రాథమికంగా ఒక్కో స్కూల్ డిస్ట్రిక్ట్ను ఏర్పాటు చేయాలని సూచించింది.
Also Read: Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?
పాఠశాల విద్యలో మూడు భాషల విధానాన్ని ఒకటో తరగలి నుంచి అమలు చేయాలని సర్కార్ కు ప్రతిపాదించింది. తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లిష్, హిందీని ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని సూచించింది. అంతేకాకుండా నర్సరీ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యాబోధన మాధ్యమం కచ్చితంగా ఇంగ్లిష్ లోనే ఉండాలని స్పష్టంచేసింది. ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో కమిషన్ కీలక సంస్కరణను ప్రతిపాదించింది. ఇకపై కేవలం సర్వీసు సీనియారిటీ ఆధారంగా ఇచ్చే ఆటోమేటిక్ ప్రమోషన్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది.
బోధనా సామర్థ్యం, పనితీరు, అర్హత పరీక్షల ఆధారంగానే పదోన్నతులు కల్పించాలని, అప్పుడే విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని కమిషన్ తన నివేదికలో అభిప్రాయపడింది. ఈ అంశంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, పాఠశాలల నిర్వహణలో స్థానిక సంస్థల భాగస్వామ్యం పెరగడంతో పాటు, టీచర్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని విద్యా వర్గాలు భావిస్తున్నాయి. కమిషన్ ఇచ్చిన ఈ నివేదికపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.