GHMC Elections 2026: స్వేఛ్చ బ్యూరో: జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు త్వరలోనే ముగియనున్నందున ఆ తర్వాత జరిగే ఎన్నికల కోసం సిటీలోని వివిధ రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం అధికార, విపక్షాలకు చెందిన పార్టీలు పురపోరులో విజయం దిశగా వ్యూహాలు రచిస్తుంటే, జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 10న అధికార గడువు ముగించుకోనున్న కార్పొరేటర్లు ఈ సారి కాస్త ముందుగానే ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ మరోసారి రూపాంతరం చెందటంతో పునర్విభజనతో వార్డులు సరి కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం 150 వార్డులకు కార్పొరేటర్లుగా వ్యవహారిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు పరిస్థితి ఇపుడు ఏమిటీ? ఏఏ ప్రాంతాలు వార్డు నుంచి బయటకు పోయాయి? కొత్తగా ఏ ఏ ప్రాంతాలు వార్డు పరిధిలోకి వచ్చాయన్న విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా కొద్ది రోజుల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికలు, ప్రస్తుతం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండటం, 10వ తేదీ జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు ముగుస్తుండటంతో త్వరలోనే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారన్న సమాచారం మేరకు వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు, నేతలతో పాటు త్వరలోనా తాజా మాజీ కార్పొరేటర్లు కానున్న ప్రస్తుత పాలక మండలి సభ్యులు సైతం ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సారి జీహెచ్ఎంసీలోకి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో వార్డుల సంఖ్య రెండింతలై 300 లకు పెరిగిన సంగతి తెల్సిందే. మున్సిపల్ వార్డుల పునర్విభజనతో సరిహద్దులు పూర్తిగా మారిపోయి. ఈ సమాచారాన్ని అప్పటికే జీహెచ్ఎంసీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచటంతో కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు, మాజీ కార్పొరేటర్లు, త్వరలో మాజీ లు కానున్న పలువురు కార్పొరేటర్లు రూపురేఖలు మారిన తమ వార్డుల సరిహద్దులు, అందులోని వివిధ సామాజికవర్గాల వారీగా తమ ఓటు బ్యాంక్ లను వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు.
ముఖ్యంగా తన సామాజికవర్గానికి చెంది ఎన్ని ఓట్లున్నాయి? అవి ఎంత వరకు మనకు ఫేవర్ గా పోలవుతాయన్న విషయాలను పరిగణలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, విపక్షం బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం పార్టీలకు చెందిన ఆశావాహులు ఇప్పటి నుంచే పలు సందర్భాలను పురస్కరించుకుని భారీగా ఫ్లెక్సీలు వంటి ఏర్పాటు చేసుకుని ఫ్రీ ప్రచారాన్ని చేసుకుంటున్నారు. వార్డుల పునర్విభజన కారణంగా సరిహద్దులను గుర్తించి, ఏఏ ప్రాంతాల ఓటర్లు తమను ఆదరిస్తారన్న విషయాలపై అంచనాలేస్తున్నారు. వార్డులో వివిధ ప్రాంతాల వారీగా ఓటు బ్యాంక్ పై ఆయా పార్టీలకు చెందిన నేతలు అవసరమైతే సీనియర్లను ఆశ్రయించి సూచనలు, సలహాలను తీసుకోవటంలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. మరి కొందరు జీహెచ్ఎంసీ ని మూడు కార్పొరేషన్లు చేసిన తర్వాత తాము ఏ కార్పొరేషన్ పరిధిలోకి వస్తామోనన్న సమాచారాన్ని సేకరించటంలో మరి కొందరు బిజీగా ఉన్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని గత 150 వార్డుల్లో త్వరలో మాజీలు కాబోయే కార్పొరేటర్లే పోటీ చేసే అవకాశాలున్నప్పటికీ, వీటిలో విపక్షాలకు చెందిన పలువురు కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలిసింది.
ఈ నెల 10వ తేదీన ప్రస్తుతమున్న పాలక మండలి అధికార గడువు ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లకుగా విభిజించేందుకు సర్కారు నుంచి ఆదేశాలు రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా విభజనకు సంబంధించి మూడు కార్పొరేషన్లకు ఆదాయం పంచే విషయ సులువైన ప్రక్రియే అయినా ప్రస్తుతం జీహెచ్ఎంసీకి ఉన్న రూ. 4100 కోట్ల అప్పును మూడు కార్పొరేషన్లకు ఎంతెంత శాతం పంచాలన్న విషయంపై సర్కారు పర్సెంటేజీలను నిర్ణయిస్తూ, కీలకమైన ఆదేశాలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నందున, వచ్చే మే, జూన్ మాసాల్లో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
Also Read: Horror Thriller Movie OTT : తల కోసం ఆత్మ బీభత్సం… వణికిపోయే ఒంటరి ఫ్యామిలీ