GHMC: జీహచ్ఎంసీలో మళ్లీ హోర్డింగ్, యునిపోల్స్ ల పంచాయతీ మొదలైంది. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 2020లో హోర్డింగ్, యునిపోల్స్ లు పలు చోట్ల కూలిపోయి వరుసగా ప్రమాదాలు జరిగి, ప్రజల ప్రాణాలు కొల్పొయినందు జీహెచ్ఎంసీ (GHMC) అప్పటి నుంచి సిటీలో హోర్డింగ్ లను నిషేధించింది. దీంతో యాడ్ ఏజెన్సీలు కోర్టును ఆశ్రయించటంతో ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల హోర్డింగ్స్, యునిపోల్స్ ఫ్రేమ్ లు అలాగే మిగిలిపోయాయి. ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఇదిలా ఉండగా, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ సర్కారు బల్దియాకు ప్రీయాంబుల్ ప్రతిపాదనలు పంపటం, దాన్ని కౌన్సిల్ ఆమోదించిన వెంటనే విలీనం ప్రక్రియను అధికారులు వేగవంతంగా పూర్తి చేశారు.
అంతటితో ఆగని అధికారులు ఎవరూ ఊహించని విధంగా ఎంతో వేగంగా వార్డుల పునర్విభజనతో పాటు విలీన ప్రాంతాలను కలుపుకుని జోన్లు, సర్కిళ్లను రెండింతలకు పెంచారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో గడిచిన అయిదున్నరేళ్ల నుంచి హోర్డింగ్స్, యునిపోల్స్ నిషేధం ఉండగా, ఇపుడు ఆ నిషేధాన్ని విలీన ప్రాంతాల్లో కూడా అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ఈ మేరకు సుమారు 250 నుంచి 300 వరకు యాడ్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా కూడా హోర్డింగ్ లు, యునిపోల్స్ పై నిషేధముందని, ఇప్పటి వరకు అక్రమంగా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్ లు, యునిపోల్స్ లను తొలగించాలని, దీంతో పాటు మిగిలిపోయిన ఫ్రేమ్ లను ఏజెన్సీలే తొలగించాలని, లేని పక్షంలో మేమే తొలగిస్తామంటూ జీహెచ్ఎంసీ అల్టిమేటం జారీ చేసింది. ఒక వైపు హోర్డింగ్ లన తొలగించాలని జీహెచ్ఎంసీ నోటీసులివ్వగా, మరో వైపు హైడ్రా ఏకంగా ఎలాంటి సమాచారం లేకుండా హోర్డింగ్ లను తొలగిస్తుంది.
దీంతో విలీన ప్రాంతాల్లోని యాడ్ ఏజెన్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ యాడ్ వింగ్ అధికారులను కలిశారు. అధికారులు యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు వచ్చిన సమాచారాన్ని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి దృష్టికి తీసుకెళ్లగా, ఈ నెల 9వ తేదీన యాడ్ ఏజెన్సీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన సూచించినట్లు తెలిసింది. పాత జీహెచ్ఎంసీ పరిధిలో 2020 లో హోర్డింగ్స్, యూనిపోల్స్ ని జీహెచ్ఎంసీ బ్యాన్ చేసింది. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తరించడంతో విలీన ప్రాంతాల్లో ఇదే నిషేధ నిబంధనను అక్కడ కూడా వర్తించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. లోకల్ బాడీల్లో 2023 వరకు అధికారికంగా ట్యాక్స్ లు కలెక్ట్ చేసి అనుమతులచ్చిన ఆ తరువాత అక్కడ కూడా బ్యాన్ చేశారు. అయినా కొనసాగిస్తుండటంపై అధికారులు ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
వెంటనే ఫ్రేమ్ లు తొలగించకపోతే మేమే తొలగిస్తామని కూడా జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటికే ఓ పక్కన అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ లను హైడ్రా తొలగిస్తుండటం, మరో వైపు జీహెచ్ఎంసీ కూడా వీరికి నోటీసులు జారీ చేయటంతో ఏజేన్సీలు మండిపడుతున్నాయి. కొత్త పాలసీ వచ్చేంత వరకు తమ హోర్డింగ్స్, యూనిపోల్స్ తొలగించొద్దని జీహెచ్ఎంసీ అధికారులను ఏజెన్సీలు కోరుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అడ్వర్టైజ్ మెంట్ డిప్యూటీ కమిషనర్ పద్మకి తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (టోమో) తరపున ఏజేన్సీల నిర్వహకులు వినతిపత్రం అందించారు. ఈ నిర్ణయంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే ఎంతో మంది నష్టపోయామని వాపొయినట్లు తెలిసింది. పెద్ద పెద్ద యాడ్ ఏజేన్సీలు వారి ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారని, కేవలం చిన్న ఏజేన్సీలైన మేము రోడ్డు పడుతున్నామని విన్నవించగా, విరితో సమావేశం నిర్వహించేందుకు అదనపు కమిషనర్ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది.