LRS Scheme: స్వేచ్ఛ బ్యూరో: ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల క్లియరెన్స్ కు 25 శాతం రాయితీ ఇస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేయటంతో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ దరఖాస్తుల క్లియరెన్స్తో నిధులు సమకూర్చుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన- అభివృద్ది ప్రణాళికలో భాగంగా 99 డేస్ కార్యచరణలో భాగంగా ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఆరేళ్ల క్రితం ఖాళీ స్థలాలు, ఖాళీ ప్లాట్లకు సంబంధించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు, ఇపుడు క్రమబద్ధీకరించేందుకు చెల్లించాల్సిన మొత్తం ఫీజును ఒకే సారి చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తూ క్రమబధ్దీకరించనున్నారు.
ఈ అవకాశం వచ్చే జూలై 31 వ తేదీ వరకున్నట్లు చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు హెల్ప్ డెస్క్, ప్రత్యేక కాల్ సెంటర్ ను అందుబాటులోకి తేనున్నారు. అన్ని సర్కిళ్లలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎల్ ఆర్ఎస్ -2020 బ్యానర్ తో పని చేయనున్న ఈ హెల్ప్ డెస్క్ లలో టౌన్ ప్లానింగ్ వింగ్ నుంచి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అధికారిని నియమించనున్నారు.
Also read: ఘనంగా బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం… హాజరైన సినీ ప్రముఖులు!
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ కోసం ప్రతి సర్కిల్ లో ఏర్పాటు చేయనున్న హెల్ప్ డెస్క్ దరఖాస్తుదారుడి ప్లాటు క్రమబద్ధీకరించేందుకు విధించిన ఛార్జీలు ఏ ప్రాతిపదికన విధించారు? ఎంత విదించారు? అందులో 25 శాతం ఎంత వరకు రాయితీ లభిస్తుందన్న విషయాలను దరఖాస్తుదారులకు వివరించారు. దీనికి తోడు ప్లాటు క్రమబద్దీకరణకు ఇంకా కావల్సిన డాక్యుమెంట్ల వివరాలను దరఖాస్తుదారుడికి తెలియజేయనున్నారు. కొన్ని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే అధికారులు షార్ట్ ఫాల్ లను కూడా పెట్టారు. ఈ షార్ట్ ఫాల్ కు దరఖాస్తుదారులకు సింపుల్ గా అర్థమయ్యేలా కూడా ఈ హెల్ప్ డెస్క్ లు వివరించనున్నాయి.
గత సంవత్సరం కూడా ఫిబ్రవరి నుంచి జూలై మాసం వరకు ఎల్ఆర్ఎస్-2020 దరఖాస్తులను క్లియర్ చేసుకునేందుకు సర్కారు గడువు ఇచ్చింది. కానీ అప్పట్లో స్పందన అంతంతమాత్రమే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 25.70 లక్షల దరఖాస్తుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చాలా మంది దరఖాస్తుదారులకు రెండు రకాలు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు రావటంతో ఏదీ చెల్లించాలో తెలీక దరఖాస్తుదారులు ముందు రాకపోవటంతో అప్పట్లో సర్కారు ప్రయత్నం విఫలమై, సర్కారు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరలేదు. ఇపుడు తాజాగా ప్రజాపాలన అభివృద్ది ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎల్ఆర్ఎస్ పై నిర్వహిస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్ ఎంత మేరకు ఫలిస్తుందో? వేచి చూడాలి.
Also read: చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!