Telangana Forts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని చారిత్రక సంపదకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. శిథిలావస్థకు చేరుతున్న కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు వారసత్వాన్ని కాపాడటంతో పాటు, ఇటు రాబడిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో 11 కోటలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన కోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తుంది.
తెలంగాణ గడ్డ పై వీరత్వానికి, శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలుగా నిలిచిన కోటలు త్వరలోనే పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. రాష్ట్రంలోని భువనగిరి, దేవరకొండ, రాచకొండ, మెదక్, ఖమ్మం,కౌలాస్ పోర్టు, జాఫర్ ఘడ్, ఎల్గందుల, రామగిరి, ఉట్నూరు, సర్వాయిపాపన్న పోర్టు ఈ 11 ప్రధాన కోటలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. పర్యాటక రంగంలో తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. కోటలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. దీనివల్ల అటు చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు ఉపాధి లభించనుంది.
ప్రభుత్వం గుర్తించిన కోటల్లో ప్రతి దానికీ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. భువనగిరి కోట: ఏకశిలా పర్వతంపై ఉన్న ఈ కోట అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్. దేవరకొండ కోట: రేచెర్ల పద్మనాయకుల వైభవానికి నిదర్శనం.రాచకొండ కోట: వ్యూహాత్మక రక్షణ కట్టడాలకు పెట్టింది పేరు. మెదక్ కోట: కాకతీయుల కాలం నాటి అద్భుత నిర్మాణం. ఖమ్మం కోట: హిందూ, ముస్లిం వాస్తు శైలుల కలయిక. కౌలాస్ పోర్టు (కామారెడ్డి): పశ్చిమ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన కోట. జాఫర్ ఘడ్ (జనగామ): కొండల మధ్య దాగి ఉన్న చారిత్రక రహస్యం. ఎల్గందుల కోట (కరీంనగర్): మానేరు నది తీరాన ఉన్న అందమైన కోట.రామగిరి ఖిల్లా (పెద్దపల్లి): ప్రకృతి ఒడిలో ఉన్న ఆయుర్వేద మూలికల గని.ఉట్నూరు కోట (ఆదిలాబాద్): గిరిజన సంస్కృతి, చరిత్రకు చిహ్నం. సర్వాయి పాపన్న కోట (ఖిలాషాపూర్): బహుజన వీరుడు సర్వాయి పాపన్న నిర్మించిన కోట.
Also read: ఒడిశాలో అరాచకం.. బైక్పై వెళ్తూనే మహిళ జుట్టు పట్టుకుని పిడిగుద్దులు.. వీడియో వైరల్!
ఈ 11కోటలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేటు సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు త్రిబుల్ పీ మోడల్ (పబ్లిక్-ప్రైవేటు- పార్టనర్ షిప్) విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుంది. అందుకు త్వరలోనే నోటిఫికేషన్ వేయనున్నట్లు సమాచారం. పురావస్తు శాఖ పర్యవేక్షణలో చారిత్రక కట్టడాల మూలరూపం దెబ్బతినకుండా పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కోటల వద్ద రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీరు, రెస్టారెంట్లు, సౌండ్ అండ్ లైట్ షోలు, రిసార్టుల ఏర్పాటు ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాయి. ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే టిక్కెట్లు, హోటళ్లు, గైడ్ల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి చేస్తే విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించేలా హెరిటేజ్ వాక్స్, కల్చరల్ ఈవెంట్లను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేవలం సందర్శనకే పరిమితం కాకుండా, పర్యాటకులు అక్కడ ఎక్కువ సమయం గడిపేలా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.
అడ్వెంచర్ టూరిజంలో భాగంగా భువనగిరి వంటి ఏకశిలా పర్వతాలపై రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్ సౌకర్యాలు ఉన్నాయి.అయితే కోటల సమీపంలో రాజసం ఉట్టిపడేలా విలాసవంతమైన బస ఏర్పాటు సైతం ఈ త్రిబుల్ పీ మోడల్ తో నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అదే విధంగా కోటల చరిత్రను వివరించేందుకు మల్టీమీడియా ప్రజెంటేషన్లు, ఆడియో గైడ్స్ సైతం ప్రదర్శించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలైతే, మన వారసత్వ సంపద భావి తరాలకు అందడమే కాకుండా, తెలంగాణ పర్యాటక రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలువనుంది. అదే విధంగా ఆదాయం, ఉద్యోగ కల్పన రెండు ప్రధాన లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తుంది. ఏది ఏమైనా కోటలకు మాత్రం మహర్దశ రాబోతుంది.
Also read: రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్..!