GHMC News: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్ఎంసీలో ఇప్పుడున్న వార్డులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల విభజన నేపథ్యంలో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు
20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరిగింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడున్న 150 వార్డులను 300 లకు విభజించారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.
భౌగోళిక ప్రాంతాలు, నియోజకవర్గాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వార్డుల డీలిమిటేషన్ కోసం తుది నోటిఫికేషన్ జారీ చేసే ముందు GHMC లోని ప్రజల అభ్యంతరాలను కోరింది. అందుకోసం GHMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల్లో ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించనుంది.
ప్రజల నుంచి అభ్యంతరాలకు వారం రోజులు గడువు
సరిహద్దుల వివరాలను ఆయా ఆఫీసుల నోటీసు బోర్డులలో ఉంచారు. ప్రజల నుంచి అభ్యంతరాలు తెలియజేయడానికి దాదాపు వారం రోజుల గడువు ఇచ్చింది. వచ్చిన అభ్యంతరాలపై చర్చించడానికి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు 10 జోన్లు, 50 సర్కిల్, 300 వార్డులుగా విభజించనున్నట్లు తెలుస్తోంది.
GHMC మున్సిపల్ కార్పొరేషన్గా కొనసాగుతుందా? మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తారా? అనేదానిపై స్పష్టత లేదు. గతేడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. GHMCని నాలుగు కార్పొరేషన్లుగా విభజించాలని యోచిస్తోందని చెప్పారు. కానీ మూడు కార్పొరేషన్లుగా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల మాట.
ALSO READ: తెలంగాణలో గురువారం నుంచి తొలి విడత సర్పంచ్ ఎన్నికలు
ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీపీ ఎన్నికల రానున్నాయి. అప్పుడు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఎన్నికలు రావడం ఖాయమని చెబుతున్నారు. ఈ లెక్కన వచ్చే శీతాకాలంలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరిగే అవకాశముందని ప్రభుత్వంలోని కొందరు అధికారులు చెబుతున్నారు.
ఔటర్ రింగ్ రోడ్ వరకు GHMC విస్తరణ ప్రక్రియ జరిగింది. విస్తరణకు ముందు, ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో ORRలోని గ్రామ పంచాయతీలను సమీపంలోని స్థానిక సంస్థల్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల మరొక ఉత్తర్వుల ద్వారా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీలను GHMCలో విలీనం చేశారు. వార్డు పేర్లు, సరిహద్దులను నిర్ణయించే ముందు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన విషయం తెల్సిందే.