గోదావరిఖనిలో మద్యం ప్రియులు పోలీసుల తనిఖీల నుండి తప్పించుకోవడానికి అనుసరిస్తున్న వినూత్న ఆలోచన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామగుండం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ ఆసక్తికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల నుండి తప్పించుకునే క్రమంలో కొందరు యువకులు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ టి- జంక్షన్ వద్ద ఇటీవల రామగుండం ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునే క్రమంలో ఎస్ఐ హరిశంకర్ ఒక వ్యక్తిని ఆపి తనిఖీ చేశారు. సదరు వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతని సెల్ ఫోన్ పరిశీలించారు. అందులో ‘పోలీస్ మామల స్కాడ్’ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపును చూసి పోలీసులు విస్తుపోయారు.
ఆ వాట్సాప్ గ్రూపులో వెయ్యి మంది..
ఈ గ్రూపులో సుమారు 1000 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఎక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు? ఏ ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తోంది? అనే వివరాలను సభ్యులు ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో పంచుకుంటున్నారు. పోలీసులు ఒక చోట వాహనాలు తనిఖీ చేస్తున్నారనే విషయం తెలిస్తే చాలు.. ఆ రూట్ లో వెళ్లకుండా ఇతర మార్గాల ద్వారా మద్యం ప్రియులు జారుకుంటున్నారు. ఇలా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నారు.
భారీ ట్విస్ట్ ఇచ్చిన ఎస్ఐ
విషయం తెలుసుకున్న ఎస్ఐ హరిశంకర్ తనదైన శైలిలో స్పందించారు. ఆ వాట్సాప్ గ్రూపులో స్వయంగా జాయిన్ అయ్యారు. ఒక్కసారిగా గ్రూపులోకి పోలీస్ అధికారి ఎంట్రీ ఇవ్వడంతో సభ్యులందరూ ఖంగుతిన్నారు. వెంటనే వారంతా గ్రూపు నుండి లెఫ్ట్ అవ్వడం ప్రారంభించారు. అయితే అప్పటికే పోలీసులు ఆ గ్రూపులో ఉన్న సభ్యుల ఫోన్ నంబర్లు.. వివరాలను సేకరించారు.
‘మీరందరూ పీఎస్కు రావాల్సిందే..’
ఎస్ఐ హరిశంకర్ గ్రూపులోకి రావడమే కాకుండా ఒక వీడియో సందేశాన్ని అందులో పోస్ట్ చేశారు. ‘మీ నంబర్లు అన్నీ మా వద్ద ఉన్నాయి.. త్వరలోనే మీ అందరికీ పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తాం’ అంటూ హెచ్చరించారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
కౌన్సిలింగ్ కేంద్రాలకు రావాల్సిందే..
మద్యం తాగి వాహనాలు నడపడం ప్రాణాపాయమని పోలీసులు పదేపదే చెప్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. టెక్నాలజీని తప్పుడు పద్ధతులకు ఉపయోగిస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ప్రస్తుతం సేకరించిన నంబర్ల ఆధారంగా పై అధికారులతో చర్చించి కౌన్సెలింగ్ కేంద్రాలకు వారిని పిలిపించనున్నారు. గోదావరిఖని ప్రాంతంలో ఇటువంటి గ్రూపులు ఇంకా ఎన్ని ఉన్నాయో ఆరా తీస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
ALSO READ: బ్రాయిలర్ కోడి ఇంత త్వరగా ఎలా పెరుగుతుంది.. ఇంజెక్షన్లు వేస్తారా? నిజమేంటి