Telangana News: స్వేచ్ఛ బ్యూరో: మహిళల భద్రతకు, స్వావలంభన కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. వారికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు హాస్టల్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రభుత్వం ప్రణాళికలు సైతం రూపొందించింది. ఒక్కో హాస్టల్ ను 20కోట్ల రూపాయలతో నిర్మించబోతుంది. దీంతో మహిళలకు రక్షణ కల్పించనుంది.
కోటిమంది మహిళలను కోటీశ్వర్వులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతుంది. వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు పథకాలు రూపొందించడం, మరోవైపు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాల బలోపేతం, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ఇది ఇలా ఉంటే ఉద్యోగం, విద్య కోసం నగరాలకు వచ్చే మహిళలకు భద్రతతో కూడిన, సౌకర్యవంతమైన నివాస వసతి కల్పించడం చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.
Also Read: Hariteja: కేవలం పని మనిషి పాత్రలే ఎందుకు?.. హరితేజ సమాధానమిదే!
హైదరాబాద్ జిల్లాలో నాలుగు హాస్టల్స్ నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో యూసుఫ్ గూడ, ఖైరతాబాద్, షేక్పేట్, ఆసిఫ్నగర్ ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ నిర్మించబోతున్నారు. మంగళవారం యూసుఫ్ గూడలో హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించబోతున్నారు. ఒక్కో హాస్టల్లో కనీసం 500 మంది మహిళలు నివసించే విధంగా అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ హాస్టల్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం నగరానికి వచ్చే అనేక మహిళలకు భద్రమైన వసతి లభిస్తుంది. ఇది మహిళల ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంలో, వారి ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం ఏర్పడితేనే వారు ధైర్యంగా ముందుకు వెళ్లి తమ ప్రతిభను చాటుతారు. వారికి భరోసా సైతం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే మహిళల భద్రత, జీవన సౌలభ్యం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఆ దిశలో ఒక ముఖ్యమైన అడుగు.ఈ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది. నిర్మాణ నాణ్యతను కాపాడుతూ, సమయానికి హాస్టల్స్ అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.
Also Read: Hyderabad Murder: వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తి దారుణ హత్య..!