Hyderabad Murder: స్వేచ్ఛ బ్యూరో: వెయ్యి రూపాయల కోసం జాబ్ కన్సల్టెన్సీ యజమానిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అడ్డుకోవటానికి ప్రయత్నించిన ఉద్యోగినిపై కూడా కత్తితో దాడి చేశారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మధురానగర్ ప్రాంతంలో శశికిరణ్ రెడ్డి వారాహి జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. దీంట్లో లయ ఉద్యోగిని. ఇదిలా ఉండగా కొన్నిరోజుల క్రితం ప్రభు అనే వ్యక్తి కన్సల్టెన్సీకి వచ్చి తనకు ఉద్యోగం చూసి పెట్టాలని అడిగాడు. దీని కోసం 2,500 రూపాయలు చెల్లించాడు. ఈ క్రమంలో శశికిరణ్ రెడ్డి అతనికి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించాడు.
అయితే, రెండు రోజులు పని చేసిన ప్రభు ఉద్యోగం నచ్చలేదని మానేశాడు. ఆ తరువాత శశికిరణ్ రెడ్డి వద్దకు వచ్చి తాను కట్టిన డబ్బు వాపసు చేయమన్నాడు. దాంతో శశికిరణ్ అతనికి 15వందల రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. అయితే, మిగితా వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలని తిరుగుతున్న ప్రభు తన డబ్బు వాపసు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. మంగళవారం మధ్యాహ్నం కన్సల్టెన్సీకి వచ్చి డబ్బు గురించి అడిగాడు.
Also Read: EV Scooter Charging in Summer: సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్.. ఎంతసేపు చేస్తే మంచిది?
ఓ ఉద్యోగం చూసి పెట్టినందుకు ఆ వెయ్యి రూపాయలు సరిపోయాయని చెప్పిన శశికిరణ్ రెడ్డి డబ్బు ఇచ్చేది లేదని చెప్పాడు. దాంతో కోపంతో రెచ్చిపోయిన ప్రభు వెంట తెచ్చుకున్న కత్తితో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోవటానికి ప్రయత్నించిన లయను కూడా పొడిచి అక్కడి నుంచి ఉడాయించాడు. స్థానికంగా ఉన్న వారు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే శశికిరణ్ రెడ్డి చనిపోయాడు. లయ ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలింపు మొదలు పెట్టారు.
Also Read: Panchayat Raj: గుడ్ న్యూస్.. పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్లు!