Mahesh Kumar: బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరచారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, బిసి రిజర్వేషన్లను సాధించి తీరుతామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావని, ఏ ఒక్కరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన బీసీ వర్గాలను కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ ఈశ్వరచారి కుటుంబానికి అందజేశారు.
ఇటీవల బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా చట్టపరమైన, రాజకీయపరమైన ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. బీసీ సమాజం ఎవరూ కూడా అధైర్యపడవద్దని, బిసి రిజర్వేషన్లను ఖచ్చితంగా సాధించి తీరుతామని ఆయన గట్టి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా.. ఈశ్వరచారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సహాయాన్ని ఆయన ప్రకటించారు. రూ. 5 లక్షల నష్టపరిహారంతో పాటు, ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈశ్వరచారి కుటుంబానికి కొండంత అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. బిసి సమాజం తమ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మరియు ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నష్టపరిహారం చెక్కు అందజేత కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డా.వినయ్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, బిసి సంఘం నాయకులు గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు కృషి చేస్తోందని, దీనిపై అందరూ విశ్వాసం ఉంచాలని నేతలు కోరారు.
మహేష్ కుమార్ గౌడ్,మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇందుకోసం అవసరమైతే అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. ఏ ఒక్కరి త్యాగం వృథా పోకుండా, బిసిల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు చెప్పారు. బిసి సమాజం సంయమనం పాటించి, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.