Village Cleanliness: స్వేచ్చ బ్యూరో: మన ఊరు.. మన బాధ్యత అనే నినాదంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో ఆదివారం ప్రత్యేక శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పారిశుధ్య పరిరక్షణ లక్ష్యంగా ఊరి కోసం – ఒక్కరోజు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ ప్రారంభించారు. గ్రామాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామంలోని ప్రధాన రహదారులు, మురుగు కాలువలు, డ్రైనేజీలు శుభ్రం చేస్తూ సర్పంచ్ స్వయంగా శ్రమదానంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, యువకులతో కలిసి పారిశుధ్య పనులు నిర్వహించారు. చెత్తాచెదారం తొలగింపు, కాలువల శుభ్రత, మొక్కల సంరక్షణ వంటి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుతూ మనల్ని పెంచిన ఈ నేల బాగు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. పెద్ద గ్రామం కావడంతో తక్కువ పారిశుధ్య సిబ్బందితో గ్రామ పరిశుభ్రత నిర్వహించడం సవాలుగా మారింది. అందుకే గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ ఊరి కోసం – ఒక్కరోజు కార్యక్రమాన్ని ప్రారంభించాం. అని తెలిపారు.
Also Read: వివాదంలో రిజ్వాన్…స్టేడియాల్లో అల్లాకు ప్రార్థనలు చేయొద్దంటూ ప్రకటన !
ప్రతి నెలలో రెండు రోజుల పాటు వార్డుల వారీగా శ్రమదానం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామానికి చెందిన వారు కూడా నెలలో ఒకరోజు గ్రామానికి వచ్చి శ్రమదానంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత. వారంలో ఒకరోజు మన ఊరి కోసం కేటాయిద్దాం. రండి మాతో కలిసి చేతులు కలపండి అంటూ సర్పంచ్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుల్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Also read: రైతన్నలకు పిడుగులాంటి వార్త.. మళ్లీ పెరిగిన ధరలు..?