PM Modi: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తదుపరి లక్ష్యం తెలంగాణే అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం దేశ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు అవినీతి.. వారసత్వ రాజకీయాలను తిరస్కరించి అభివృద్ధి వైపు మొగ్గు చూపారని.. అదే స్పూర్తి ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.
“నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు..” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఓడిపోయింది కేవలం ఒక పార్టీ మాత్రమే కాదని.. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు.. అరాచక శక్తులు ఓడిపోయాయని ఆయన అన్నారు. బెంగాల్లో జనం ఎలాగైతే మార్పును కోరుకున్నారో.. తెలంగాణలోనూ అదే ఉత్సాహం.. మార్పు కోసం తపన ప్రజల్లో కనిపిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే అని మోదీ స్పష్టం చేశారు. “బెంగాల్ గెలిచాం.. వచ్చేది తెలంగాణలో మన ప్రభుత్వమే..” అంటూ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు. కుటుంబ పాలన.. అవినీతి కోరల్లో చిక్కుకున్న తెలంగాణను విముక్తం చేసే సమయం ఆసన్నమైందని.. ప్రజలు తమను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని.. ఇది తెలంగాణ ప్రజల విజయం అవుతుందని ప్రధాని ఆకాంక్షించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విఫల హామీలు.. వారి వారసత్వ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనేది బీజేపీ మూల మంత్రమని ప్రధాని పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం దూసుకుపోతున్న తరుణంలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమని.. మన హైదరాబాద్ ఈ ప్రయాణానికి వేగం అందించాలని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మోదీ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న 14 పారిశ్రామిక కారిడార్లలో ఒకటి జహీరాబాద్లో రూపుదిద్దుకుంటోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. వాహనాల తయారీ నుండి ఆహార శుద్ధి వరకు అత్యాధునిక ‘ఎకో సిస్టమ్’ ఇక్కడ ఏర్పడనుందని.. ఇది లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తూ మధ్యతరగతి ప్రజలకు వరంగా మారుతుందని పేర్కొన్నారు.
వరంగల్లో నిర్మిస్తున్న పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కు తెలంగాణ వస్త్ర పరిశ్రమను సరికొత్త శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది స్థానిక పత్తి రైతుల తలరాతను మారుస్తుందని.. పత్తి నాణ్యతను పెంచేందుకు కేంద్రం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల ప్రత్యేక మిషన్ రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. ఈ చర్యల వల్ల పత్తి దిగుమతులపై భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని మోదీ విశ్లేషించారు.
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బంగారం కొనుగోలును తగ్గించాలని ప్రధాని కోరారు. “పూర్వం యుద్ధ సమయంలో ప్రజలు బంగారం దానం చేసేవారు. ఇప్పుడు దానం అక్కర్లేదు.. కానీ దేశం కోసం ఏడాది పాటు ఏ శుభకార్యానికైనా బంగారం కొనబోమని ప్రతిజ్ఞ చేయండి. ఇది దేశభక్తికి సవాలు. ఈ సవాలును స్వీకరించి విదేశీ నిల్వలను కాపాడుదాం.” అని మోదీ అన్నారు. విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్.. ముఖ్యమంత్రికి ప్రధాని అదిరిపోయే రిప్లై!