Fake Liquor: స్వేచ్చ బ్యూరో: ఖరీదైన ప్రీమియం లిక్కర్ బాటిళ్లలో తక్కువ ధరకే దొరికే మద్యాన్ని కలుపుతూ అమ్ముతున్న ముఠాను ఎక్సయిజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 63 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన చికున్ స్వయిన్, సోను మహంతి, ప్రఫుల్ కుమార్ నాయక్ తేలికగా డబ్బు సంపాదించేందుకు పథకం వేసుకున్నారు. దాని ప్రకారం వేల రూపాయల ఖరీదు చేసే షివాస్ రీగల్, రాయల్ సెల్యూట్ తదితర బ్రాండ్ల మద్యాన్ని కొనేవారు. అదే సమయంలో ఇదే బ్రాండ్లకు చెందిన ఖాళీ సీసాలను కూడా సేకరించే వారు. ఆ తరువాత ప్రీమియం విస్కీ బాటిళ్లను ఖాళీ చేసి దాంట్లో తక్కువ ధరలకు దొరికే మద్యాన్ని కలిపేవారు.
ఇలా మిక్స్ చేసిన మద్యాన్ని తిరిగి షివాస్ రీగల్, రాయల్ సెల్యూట్ తదితర బ్రాండ్ల ఖాళీ సీసాల్లో నింపి ఎప్పటిలాగే ప్యాక్ చేసేవారు. అనంతరం మార్కెట్ ధరకన్నా కాస్త తక్కువకే సప్లయ్ చేస్తామంటూ ఫంక్షన్లు నిర్వహించే వారికి, బడా బాబులకు విక్రయిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో ఎక్సయిజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సీఐ సావిత్రి సౌజన్య, ఎస్ఐ శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు జనార్ధన్ రిజ్వాన్, సిద్ధిఖీ, అనుషాతో కలిసి నిఘా పెట్టారు. రసూల్ పురా ప్రాంతంలో ముఠాలోని చికున్ స్వయిన్, సోను మహంతి షివాస్ రీగల్ మద్యం బాటిళ్లను విక్రయించటానికి ప్రయత్నిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి ఆరు బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also read: రాత్రిపూట మామిడి పండు తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!
విచారణలో మాదాపూర్ లో మిక్సింగ్ జరుగుతున్నట్టు వెల్లడి కావటంతో ఎక్సయిజ్ సీఐ సావిత్రి సౌజన్య సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. తనిఖీలు జరిపి మిక్సింగ్ చేసి పెట్టిన 41 ఫుల్ బాటిళ్ల షివాస్ రీగల్ మద్యాన్ని సీజ్ చేశారు. దాంతోపాటు కల్తీ చేసిన మద్యాన్ని నింపటానికి సిద్ధంగా పెట్టుకున్న మరో 63 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 25వేల రూపాయలకు దొరికే రాయల్ సెల్యూట్ విస్కీ బాటిళ్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రఫుల్ కుమార్ కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను తదుపరి దర్యాప్తు నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
Also read: బెంగాల్ గెలిచాం.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ