బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురు దక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ‘కత్తి ఏపీది కావచ్చు, కానీ పొడిచేది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రే’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
బనకచర్ల వెనుక అసలు కుట్ర
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ గళమెత్తే వరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని హరీష్ రావు విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఆగలేదని, దానిని నల్లమలసాగర్ పేరుతో ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆయన ఆరోపించారు. నల్లమలసాగర్ నిర్మాణానికి చంద్రబాబు సూత్రధారి అయితే, రేవంత్ రెడ్డి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు డబుల్ డేంజర్ పొంచి ఉందని హెచ్చరించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలపై విమర్శలు
ప్రాజెక్టులు ఆగిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని హరీష్ రావు కొట్టిపారేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి పెంచిన తర్వాతే పాత తేదీలతో ఉత్తమ్ లేఖలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి సంతకం పెట్టి వచ్చారని, కానీ బనకచర్లపై అక్కడ చర్చ జరిగిందని ఏపీ మంత్రులు చెబుతుంటే మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలు తమ నీటి వాటా కోసం మేల్కొన్నా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందని విమర్శించారు.
వ్యక్తిగత విమర్శలు, కమిటీ నియామకం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ బంధాలను ప్రస్తావిస్తూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్రా వ్యక్తి అయినంత మాత్రాన తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారపోస్తారా?’ అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహిగా ఉన్న రేవంత్, ఇప్పుడు నీళ్ల ద్రోహిగా మారి మొత్తంగా తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, తెలంగాణ వ్యతిరేకిగా పేరున్న ఆదిత్యనాథ్ దాస్ ను కమిటీ హెడ్ గా నియమించడం రేవంత్ రెడ్డి బండారాన్ని బయటపెట్టిందని హరీష్ రావు పేర్కొన్నారు. CWC బనకచర్ల ద్వారా ఏపీ నీళ్లు తీసుకుపోవచ్చని లేఖ విడుదల చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయమన్నారు.
ALSO READ: Khammam News: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోడి పుంజుకు అంత్యక్రియలు