Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.
నాడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని హరీశ్ రావు ఆరోపించారు. రైతుల సమస్యలపై మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను కలవకుండా నిర్బంధించడం దారుణమన్నారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీసు రాజ్యం నడుస్తోందని, రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
రెండు మూడు పంటలు పండే సారవంతమైన భూములను పరిశ్రమల కోసం లాక్కోవాలని చూడటం దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు. రైతుల భూములు లాక్కునేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతుల గొంతు నొక్కుతూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ రేవంత్ రెడ్డి వికృతానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి మోసం చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. “నీ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారెంటీలే.” అని విమర్శించారు. అవ్వాతాతలు, విద్యార్థులు, మహిళలు, పోలీసులు.. ఇలా ఏ వర్గాన్ని అడిగినా రేవంత్ రెడ్డిని ఒక రాక్షసుడిగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని మించిన రావణాసురుడు మరొకరు ఉండరని ఘాటుగా వ్యాఖ్యానించారు. పేదల ఇళ్లు కూలుస్తూ ప్రభుత్వం ఆనందం పొందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ ఫలితాలే వస్తాయని, రేవంత్ రెడ్డి కథ ముగిసిపోయిందని అన్నారు. మళ్ళీ గెలుస్తాననేది రేవంత్కు కేవలం పగటి కల మాత్రమేనని, రాష్ట్రంలో తిరిగి “రామ రాజ్యం, కేసీఆర్ రాజ్యం” వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో రేవంత్ రెడ్డి నూటికి నూరు శాతం విజయవంతం అయ్యారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Read Also: భార్యకు దగ్గరుండి పెళ్లి చేశాడు.. భర్త మాస్టర్ ప్లాన్ వేరే లెవల్, చివరకు బండారమంతా..?