Farmer Declaration: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘రైతు డిక్లరేషన్’ కేవలం మాటలకే పరిమితమైందని, ఆచరణలో అది పెద్ద బోగస్గా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాస్తూ.. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎండగట్టారు. ఎన్నికల వేళ ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రైతులను గాలికొదిలేయడం కాంగ్రెస్ నైజమని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ‘తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా’ అని ప్రగల్భాలు పలికిన సీఎం, ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని చూడటం లేదని విమర్శించారు. ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. అటు మిల్లుల దగ్గర కూడా కిలోల కొద్దీ తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని, ఎండలో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి కనీసం ‘సోయి’ లేకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సన్న వడ్లకు ఇస్తామన్న రూ.500 బోనస్ను ధాన్యం డబ్బులతో పాటే వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేవలం వరి మాత్రమే కాకుండా.. పొద్దుతిరుగుడు, శనగ, జొన్న, మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా దయనీయంగా తయారైందని లేఖలో పేర్కొన్నారు. పొద్దుతిరుగుడు రైతులు 20 రోజులుగా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, మిగిలిన 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని కోరారు. శనగ రైతుల పాలిట ప్రభుత్వ విధానాలు ‘శని’లా మారాయని, మద్దతు ధర రూ. 5,875 ఉంటే.. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు రూ. 3వేలకే అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు.
మొక్కజొన్న కొనుగోలుపై ఉన్న నిబంధనలను సడలించాలని, ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామంటే మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
Also Read: ఇన్స్టాలో ప్రేమ వల.. సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.81 లక్షల టోకరా.. లబోదిబోమంటున్న బాధితుడు