సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్ మీట్పై స్పందిస్తూ, ప్రభుత్వం విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘మసిబూసి మారేడు కాయ’ చేసే చందంగా భట్టి విక్రమార్క మాటలు ఉన్నాయని, అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక సాకులు వెతుకుతున్నారని విమర్శించారు.
నైనీ టెండర్ రద్దు వెనుక మర్మమేంటి?
నైనీ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమే అక్కడ స్కాం జరిగిందని చెప్పడానికి నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు. ‘ఏ తప్పూ జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేశారు?’ అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది ఈ వ్యవహారంలో ‘రింగ్ మెన్’ గా చక్రం తిప్పారని, ఆయన ప్రయోజనాల కోసమే ఈ తతంగమంతా నడిచిందని ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేసిన ప్రభుత్వం, అదే తరహా నిబంధనలతో పిలిచిన ఇతర టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.
సోలార్ స్కామ్పై మౌనం ఎందుకు?
సింగరేణిలో సోలార్ పవర్ టెండర్ల కుంభకోణం గురించి తాను ఆధారాలతో బయటపెట్టినా, భట్టి విక్రమార్క తన ప్రెస్ మీట్లో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై హరీష్ రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ, కీలకమైన సోలార్ స్కామ్పై మౌనం వహించడం వెనుక అంతర్యమేమిటని అడిగారు.
నిబంధనల నెపం బీఆర్ఎస్పైకి నెట్టొద్దు
సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన 2018 నుంచే ఉందని చెబుతూ, ఆ నెపాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని హరీష్ రావు కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చూపినంత మాత్రాన జరిగిన అవినీతి అబద్ధం కాదని స్పష్టం చేశారు. సైట్ విజిట్ నిబంధనను అడ్డం పెట్టుకుని అర్హులైన కంపెనీలను తప్పించి, తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో, నిష్పక్షపాత విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ‘భట్టి గారూ.. మీపై నాకు గౌరవం ఉంది. ఒకవేళ మీరు నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇస్తే, మీకు కూడా లేఖ రాయడానికి నేను సిద్ధం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కప్పిపుచ్చే ధోరణి వీడి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.