Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: పంట బోనస్ కు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే సీఎం వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించినట్లా? అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటన్నారు. ఏ రకం ధాన్యం వేయాలని సర్కారు నిర్ణయించడం అంటే రైతన్న మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. మేనిఫెస్టోలో అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ అని, తర్వాత 33 రకాల సన్నాలకు పరిమితం చేశారు.. ఇప్పుడు దాన్ని 7 రకాలకు తగ్గించారని మండిపడ్డారు. మీరు చెప్పిన 7 రకాల పంటలకే బోనస్ ఇస్తాం అంటే, ఇప్పటికే నారు పోసిన రైతుల పరిస్థితి ఏమిటి?ఇంత నిర్బందంగా, కఠినంగా రైతులతో వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? అని నిలదీశారు.
మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం
రైతులంటే ఈ ప్రభుత్వానికీ ఎందుకు అంత కోపం?రైతు బంధు, పంట బోనస్, పంట బీమా, రైతు బీమా గురించి సమీక్ష చేయకపోవడం అంటే రైతు సంక్షేమాన్ని విస్మరించడమేనన్నారు. గత మూడు సీజన్లకు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగికి రెండు ఎకరాలకు రైతుభరోసా ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. 45 రోజుల్లో ఇస్తామని సిద్దిపేట వేదికగా సీఎం చెప్పి 85 రోజులు దాటిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. మాటలు కోటలు దాటితే సీఎం చేతలు గడప దాటదు అనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు. ఆతృతగా రైతు భరోసా కోసం ఎదురుచూసిన రైతుల ఆశలపై సీఎం సమీక్ష కుండెడు నీళ్ళు చల్లిందన్నారు. ఎన్నికలు లేకుంటే రైతు భరోసా ఇవ్వరా?గత 5 నెలల నుండి రైతు బీమా కిస్తీ కట్టక, రైతు కుటుంబానికి కేసీఆర్ ఇచ్చిన భద్రతను, భరోసాను లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: అధికారులు మాట వినడం లేదు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు!
ఎరువులు, విత్తనాలు రైతువేదికల ద్వారా సరఫరా
పంట మార్పిడి అంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. మీ మాటలు నమ్మి గత సీజన్ లో మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు, సోయా, వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైందన్నారు. ఈ పంటలను మద్దతుధరకు కొంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందా ? దానికి గ్యారంటీ ఏమిటి ? యాసంగి మాదిరిగానే రైతులను రోడ్డున పడేస్తుందా ?ఎరువుల సరఫరా చేయలేక యాప్ తెచ్చిన మీ ప్రభుత్వం అందులోనూ విఫలం అయిందన్నారు. ఇప్పుడు ఎరువులు, విత్తనాలు రైతువేదికల ద్వారా సరఫరా చేయాలని చెబుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
సీజన్ కు ఒకరకంగా వ్యవహరిస్తూ రైతులను ఎందుకు గందరగోళం చేస్తున్నారు? పంట బీమా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్ లో చెప్పి రెండేళ్లయినా అమలు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. కరువు ఉందని చెబుతున్న ప్రభుత్వం పంటల భీమా పథకం గురించి ఎందుకు మాట్లాడటం లేదు?గత మూడు వేసవి కాలాల్లో వడగళ్ళు, అకాల వానల వల్ల నష్ట పోయిన రైతుల వద్దకు స్వయంగా మంత్రులు వెళ్లి చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. రైతులకు ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పక్షాన డిమాండ్
ఇప్పటికైనా మొక్కుబడి సమీక్షలు చేయడం ఆపేసి, రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి చూపండన్నారు. ప్రచార యావను తగ్గించి, రైతు సంక్షేమం గురించి దృష్టి పెట్టండి అని సూచించారు. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్ని రకాల పంటలకు పంట బోనస్ చెల్లించాలని, గత యాసంగి, ఈ యాసంగి పంటలకు పెండింగ్ పెట్టిన బోనస్ డబ్బులు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.