Paidi Rakesh Reddy: స్వేచ్ఛ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై, కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సూచించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని తెలిసి, రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయ డ్రామాలు చేస్తున్నారన్నారు.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తెచ్చుకోలేని ఆయన.. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కిషన్ రెడ్డిని నిందిస్తున్నారన్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయాలకు కిషన్ రెడ్డికి ఏం సంబంధమని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా చూడటం మానుకోవాలని సూచించారు. మెట్రోకు ఇప్పటివరకు పూర్తి డీపీఆర్ కూడా లేదని, కానీ కేంద్రాన్ని నిందించడం మాత్రం మొదలుపెట్టారని సీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మెట్రోను నిలబెట్టింది, మొదటి దశకు నిధులు ఇచ్చింది మోడీ ప్రభుత్వమేనన్నారు. మొదటి దశలోనే కేంద్రం రూ.1,200 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.
Also Read: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధులు విడుదల చేయండి.. కిషన్రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ!
కాంగ్రెస్.. అవినీతి ప్రాజెక్టులకు అనుమతులు రాకపోతే, డీపీఆర్లు ఆమోదం పొందకపోతే, దానికి కిషన్ రెడ్డిని బాధ్యుడిని చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కిషన్ రెడ్డిపై అవాకులు, చెవాకులు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు అంటూ దశాబ్దాలుగా మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని రాకేశ్ రెడ్డి విరుచుకుపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్కు కేంద్రం ఆమోదాలు, నిధులు ఇచ్చిందని, మరి సౌత్ అలైన్మెంట్ను ఎందుకు మార్చాలని చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
మంత్రులు, సీఎంకు సంబంధించిన వ్యక్తులు ముందుగానే భూములు కొనుగోలు చేశారా? అందుకే అలైన్మెంట్ మార్చాలనుకుంటున్నారా? అని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ అంటూ యువతను మోసం చేశారన్నారు. అధికారులు మాట వినడం లేదని స్వయంగా సీఎం చెబుతున్నారని, మరి రాష్ట్ర పరిపాలనపై ఆయనకు పట్టు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.