Harish Rao: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ పథకం పనుల బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లులు రాక అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతున్న సుమారు 1500 మంది సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం హరీష్ రావును కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం తమను మొండిచెయ్యి చూపిస్తోందని.. న్యాయంగా రావాల్సిన సొమ్ము అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు వాపోయారు. కాంట్రాక్టర్ల గోడును విన్న హరీష్ రావు ఈ వ్యవహారంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ హయాంలో పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ పనులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేశామని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసిన వారు నేడు వడ్డీలు కట్టలేక రోడ్డున పడ్డారని.. ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. పెయింటింగ్.. బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం వందల కోట్లు రాత్రికి రాత్రే ఎలా విడుదల చేసిందని ఆయన నిలదీశారు. కమీషన్లు ముట్టవనే ఉద్దేశంతోనే పేద బిడ్డల కోసం పనిచేసిన వారిని విస్మరించారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
బకాయిల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా.. విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని హరీష్ రావు మండిపడ్డారు. చివరికి ఆర్థిక మంత్రి చాంబర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యంపై సాక్షాత్తు శాసనమండలి చైర్మన్ కూడా సభలో ఆవేదన వ్యక్తం చేశారని.. స్వయంగా ఆయన కోరినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యాశాఖకు వచ్చిన నిధులను కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇకనైనా తన పంతాన్ని వీడి పేద విద్యార్థుల పాఠశాలలను బాగుచేసిన ఆ 1500 మంది చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్ల ఉసురు పోసుకోవద్దని.. వారి కుటుంబాలను రోడ్డున పడేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్తులో బాధితుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Read Also: Nara Lokesh: జగన్ వస్తానంటే టికెట్ నేనే కొంటా.. టీ20 వరల్డ్ కప్ మ్యాచుపై లోకేశ్ సెటైర్లు..