Uttam Kumar: నిజామాబాద్ జిల్లా జాకోరా బహిరంగ సభలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల పునరుద్ధరణ, నిధుల మంజూరు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఆయన మాట్లాడారు.
సిద్దాపూర్ రిజర్వాయర్కు రూ. 250 కోట్ల నిధులు
మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరిన వెంటనే సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల కోసం రూ. 250 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి అవసరాలు తీరనున్నాయి. అలాగే, రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో పూడిక చేరడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక నిజాంసాగర్ ప్రాజెక్టులో త్వరలోనే పూడికతీత (డిసిల్టేషన్) ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
రికార్డు స్థాయిలో వరి దిగుబడి
గడిచిన 25 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని కొనియాడారు. భవిష్యత్తులో ఉత్తర తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
మేడిగడ్డ వైఫల్యంపై విమర్శలు
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరకుండా ఉంటే, కేవలం కొన్నేళ్ల క్రితం కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడం, కూలిపోవడం వారి లోపభూయిష్ట డిజైన్ల వల్లేనని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ ఎలాంటి రాజకీయం చేయడం లేదని, తప్పులను సరిదిద్ది ప్రాజెక్టును వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ఘనపూర్లో రాజయ్య ‘తాండవం’.. భట్టి, కడియంల గుట్టు విప్పుతూ సంచలన వ్యాఖ్యలు!