Nursing Transfers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యరంగంపై బదిలీల వేటు పడింది. వైద్యారోగ్య శాఖ చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల సాధారణ బదిలీలు తీవ్ర అసమతుల్యతకు దారితీశాయి. రోగుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నుంచి నర్సింగ్ సిబ్బంది భారీగా బయటకు వెళ్లిపోతుండగా (అవుట్ ఫ్లో), ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు కొత్తవారు వచ్చేందుకు (ఇన్ ఫ్లో) ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి కీలక దవాఖానలు నర్సింగ్ స్టాఫ్ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. జనరల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఎక్కువ మంది రూరల్, సెమీ-అర్బన్ ప్రాంతాలకు భారీగా సిబ్బంది తరలివెళ్లడం గమనార్హం.
హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య వేలల్లో ఉంటుంది. కానీ, దానికి తగ్గట్టుగా నర్సింగ్ సేవలు అందించే వారే కరువయ్యారు. బదిలీల ప్రక్రియలో జరిగిన లోపాల వల్ల ప్రధాన ఆసుపత్రుల నుంచి వందలాది మంది నర్సులు రిలీవ్ అవుతుండగా, ఇన్-కమింగ్ మాత్రం దాదాపు ‘నిల్’ అనే చెప్పాలి. ఉస్మానియా ఆసుపత్రిలో 130 పోస్టులు ఖాళీగా ఉండగా.. తాజా బదిలీల్లో 52 మంది బయటకు వెళ్లిపోయారు. కానీ లోపలికి వచ్చిన వారు ఒక్కరు కూడా లేరు. ఇక గాంధీ ఆసుపత్రిలో 66 ఖాళీలు ఉండగా.. ఏకంగా 82 మంది అవుట్ అయ్యారు, కేవలం ఇద్దరు మాత్రమే ఇన్ అయ్యారు. నిలోఫర్ చిన్నారుల ఆసుపత్రిలో 124 ఖాళీలతో ఇప్పటికే ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు మరో 40 మంది బదిలీపై వెళ్లిపోయారు. ఇక్కడికి రావడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఫీవర్ ఆసుపత్రిలో 22 ఖాళీలు ఉండగా.. 18 మంది వెళ్లిపోయారు, కొత్తగా ఎవరూ రాలేదు. ఇదే పరిస్థితి సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి, పెట్టలబుర్జ్ ఆసుపత్రుల్లోనూ కనిపిస్తోంది. ఉన్న పోస్టులు ఖాళీ అవ్వడం, వచ్చే వారు లేకపోవడంతో మిగిలిన కొద్దిపాటి సిబ్బందిపై పనిభారం తీవ్రంగా పెరుగుతోంది.
హైదరాబాద్లోని ఆసుపత్రులు ఖాళీ అవుతుంటే.. వికారాబాద్, సంగారెడ్డి, కొడంగల్ వంటి ప్రాంతాలకు నర్సింగ్ అధికారులు క్యూ కడుతున్నారు. కొడంగల్లో 115 ఖాళీలు ఉండగా ఏకంగా 113 మంది కొత్తగా ఇన్ అయ్యారు. సంగారెడ్డిలో 74 ఖాళీలు ఉండగా 14 మంది వెళ్లారు. 75 మంది కొత్తగా వచ్చారు. వికారాబాద్లో 78 ఖాళీలు ఉండగా 75 మంది బయటకు వెళ్లగా, 14 మంది వచ్చారు.
Also read: ఘనపూర్లో రాజయ్య ‘తాండవం’.. భట్టి, కడియంల గుట్టు విప్పుతూ సంచలన వ్యాఖ్యలు!
సాధారణంగా బదిలీల్లో లూప్హోల్స్ ఉపయోగించి సుమారు 80 శాతం మంది హెడ్ నర్సులు “ఫోకల్ టు ఫోకల్” (కీలక స్థానాల నుండి మళ్లీ అంతే అనుకూలమైన కీలక స్థానాలకు) పోస్టింగులు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల నిజాయితీగా పనిచేసే వారికి అన్యాయం జరగడమే కాకుండా, సిబ్బంది కేటాయింపుల్లో తీవ్ర అసమతుల్యత ఏర్పడింది. ఏళ్ల తరబడి సిటీ ఆసుపత్రుల్లోనే హెడ్ నర్సులు చక్కర్లు కొడుతూ కొత్త వాళ్లకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని జూనియర్లు మండిపడుతున్నారు.
గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ఆసుపత్రులకు నిరుపేద రోగులు వస్తుంటారు. అత్యవసర విభాగాలు, ప్రసవ వార్డులు, పిడియాట్రిక్ వార్డుల్లో నర్సుల పాత్ర అత్యంత కీలకం. ఇప్పుడున్న స్టాఫ్ కొరత వల్ల రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం గగనంగా మారే ప్రమాదం ఉంది. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ బదిలీల గందరగోళాన్ని సవరించాలని, కీలక ఆసుపత్రుల్లో తగినంత మంది నర్సింగ్ ఆఫీసర్లను నియమించి పేద ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని వైద్య నిపుణులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also read: ఆకుకూరలు వారం రోజులైనా ఫ్రెష్గా ఉండాలా ? సూపర్ స్మార్ట్ ఫీచర్లున్న బెస్ట్ ఫ్రిజ్లు