Gold Ring Scheme: ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం ఇచ్చే పథకం (Thaimaman Gold Ring Scheme)పై తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దాదాపు 1.28 లక్షల బంగారు ఉంగరాల సరఫరా కోసం ప్రముఖ జ్యువెలరీ రీటైల్ సంస్థలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం రూ. 220 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది.
ద్రవిడ సిద్ధాంతకర్త, మాజీ సీఎం అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులందరికీ ఈ ఉంగరాలు ఈ బంగారు ఉంగరాలను విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అందజేయనుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులను ప్రోత్సహించడం, మాతృత్వం పొందిన తల్లులకు ప్రభుత్వం తరపున కానుకను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. ఇందుకోసం ఏటా 4,41,667 ఉంగరాల పంపిణీ కోసం రూ. 755.83 కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (TNMSC) నిర్వహించిన టెండర్ ప్రక్రియలో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. 22 క్యారెట్ల 1 గ్రాము ఉంగరానికి ఒక్క పైసా మాత్రమే సర్వీస్ ఛార్జీగా కోట్ చేసి.. టెండర్ లో 70 శాతం (89,949 ఉంగరాలు) వాటాను జోయాలుక్కాస్ సొంతం చేసుకుంది. మిగతా 30 శాతం (38,550 ఉంగరాలు) వాటాను కల్యాణ్ జ్యువెలర్స్ దక్కించుకుంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 1 గ్రాము ఉంగరం ధర రూ.14,850 గా ప్రభుత్వం అంచనా వేసింది. అయితే బంగారం ధరల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది.
ఈ టెండర్ ప్రక్రియపై ప్రతిపక్షాలైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఔషధాలు, వైద్య పరికరాల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన TNMSC ద్వారా బంగారు ఉంగరాల కొనుగోలు చేపట్టడంపై అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తాయి. ఇతర సంస్థలు రూ. 410 నుండి రూ. 15,000 వరకు అదనపు ఛార్జీలు కోట్ చేయగా.. కేవలం 1 పైసాకే ఒక సంస్థ టెండర్ దక్కించుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేశాయి.
Also Read: మొబైల్ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 24 నుంచి కొత్త సిమ్ రూల్స్.. పరిమితి దాటితే అంతే!
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచడానికి ఈ పథకం రూపొందించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి అరుణ్రాజ్ అన్నారు. మరోవైపు 1 పైసా అదనపు ఛార్జీతో టెండర్ దక్కించుకోవడంపై జోయాలుక్కాస్ స్పందించింది. సామాజిక బాధ్యత, సంక్షేమ పథకానికి మద్దతుగా ఉండాలన్న సదుద్దేశంతోనే సర్వీస్ ఛార్జ్ నామమాత్రంగా కోట్ చేశామని స్పష్టం చేసింది.
Also Read: సీఎం రేవంత్, ఉత్తమ్లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!