Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ లోపాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, కాళేశ్వరంపై కేటీఆర్ మాట్లాడడం ఎంతో సిగ్గుచేటని విమర్శించారు.
గత ప్రభుత్వ వైఫల్యం..
గత బిఆర్ఎస్ పాలనలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగడం, నాణ్యతా లోపాల వల్ల అది కుంగిపోవడం జరిగాయని మంత్రి గుర్తుచేశారు. ఆనాడు ప్రాజెక్టును సరిగ్గా నిర్మించి ఉంటే ఇప్పుడు ఈ విధమైన సమస్యలు వచ్చేవి కావని స్పష్టం చేశారు. కేటీఆర్ కంటే తెలివైన మేధావులు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి కంటే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులు ఎన్డీఎస్ఏ లో ఉన్నారని, వారి సలహాలతోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. గత పాలకుల తప్పులు ఎలా ఉన్నప్పటికీ, రైతులకు సాగునీరు అందించేందుకు ఉన్న అన్ని అవకాశాలను తమ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని హామీ ఇచ్చారు.
ఈనెల 31న NDSAతో కీలక భేటీ!
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పూర్తిగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. గేట్లు ఎత్తిపెట్టి నీటి ఫ్రీ ఫ్లో ఉండాలని ఎన్డీఎస్ఏ ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. కాఫర్ డ్యామ్ కట్టాలా వద్దా అనే అంశంపై కూడా వారి సలహా ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు. ఈ నెల 31వ తేదీన ఎన్డీఎస్ఏ ఉన్నతాధికారులతో కీలక సమావేశం ఉందని, ఆ భేటీ ముగిసిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో 100% ఎస్ఐఆర్ పూర్తి..
పాలనాపరమైన ప్రక్రియల గురించి ప్రస్తావిస్తూ.. తమ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఇప్పటికే 100 శాతం పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేస్తున్నామని తెలియజేశారు.
Also Read: డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రశాంత్ రెడ్డి ఫైర్.. ‘రెండున్నరేళ్లయినా పంపిణీ చేయరా?’