Hyderabad Manhole: వర్షాకాలం వస్తే చాలు సిటీ ప్రజలకు ఒకటే భయం. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందోనన్న భయం వారిని అనుక్షణం వెంటాడుతోంది. తాజాగా మియాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. మిస్సయిన వ్యక్తి కోసం హైడ్రా-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. అసలు ఏం జరిగింది?
మియాపూర్లో మ్యాన్ హోల్ విషాదం- హైదరాబాద్ సిటీలో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మియాపూర్లో తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వైశాలినగర్ రైల్వే అండర్పాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట్కు చెందిన బాలయ్యగా గుర్తించారు. మ్యాన్ హోల్ విషయం తెలియగానే హైడ్రా-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బాలయ్య కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.
నిర్లక్ష్యం ఎవరిది? వైశాలినగర్ అండర్పాస్ వద్ద నాలా మరమ్మతులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాలాలో పడి బాలయ్య గల్లంతయ్యాడన్నది ఆయన కుటుంబ సభ్యుల ఆరోపణ. పనులు జరుగుతున్న ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఈ ప్రమాదం తప్పదని అంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
అండర్ పాస్ కింద మరమ్మతులు-మరమ్మతులు చేసేందుకు కొన్నిరోజులుగా అండర్ పాస్ను అధికారులు మూసి వేశారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్హోల్ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి ఆయన పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై వివరాలను అధికారులు, సహాయక బృందాలను అడిగి తెలుసుకున్నారు.
ALSO READ: కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల నయా దందా..!
గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే గాంధీ. హైదరాబాద్లో రెండుగంటలపాటు వర్షాలు పడితే చాలా అందులోని నీరంతా బయటకు వస్తోంది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు ఒక్కోసారి మ్యాన్ హోల్లో పడి చనిపోయిన ఘటనలు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.