గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు హైకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాథమిక హక్కులను సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నుండి గడచిన రెండేళ్లుగా అక్రమ కేసులు బనాయిస్తూ లీకులతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని కుంగిన రెండు పిల్లర్లకు తక్షణమే మరమ్మతులు చేయించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. అందులో పదుల సంఖ్యలో ఉన్న పిల్లర్లలో కేవలం రెండు కుంగితే లక్ష కోట్లు కొట్టుకుపోయాయని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. ఈ అబద్ధం ఇప్పుడు బట్టబయలైందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్తో సహా 70 శాతం తెలంగాణ ప్రాంతానికి తాగునీరు అందిస్తున్న అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని కొనియాడారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రాణాధారమని చెప్పారు. కేవలం 100 లేదా 200 కోట్లు ఖర్చు చేస్తే మరో రెండు మూడు లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం కుట్రపూరితంగా నిధులు ఆపివేసిందని ఆరోపించారు.
అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే తన మీద రెండు ఎంక్వైరీలు వేశారని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులం అని.. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని.. వరి ధాన్యంలో తరుగు పేరిట దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని రైతు భరోసా పడలేదని విమర్శించారు. కరెంట్ లేక రైతులు రోడ్లెక్కినా మంత్రులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు రాక ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజకీయ కాలయాపన మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు విలువ లేదని.. ఏపీకి ప్యాకేజీలు వస్తుంటే తెలంగాణకు ఏం తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి అనుసంధానం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు.
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని హరీశ్ రావు ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీకి రావాల్సిన 3 వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. నిధులు లేక కార్మికులకు డీఏలు రావడం లేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోయాయని చెప్పారు. బిఆర్ఎస్ హయాంలో ఏటా 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ALSO READ: ఒక్క నెల ముఖ్యమంత్రి… ఓ వివాదస్పద రాజకీయ చరిత్రను పోగేసుకున్న నేత నాదెండ్ల !