హైదరాబాద్ మహా నగరంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో పంపిస్తున్న ‘ఫేక్ చలానా’ మెసేజ్లు కలకలం రేపుతున్నాయి. పోలీసులు ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నా.. ఎంతో మంది విద్యావంతులు సైతం ఈ మాయలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వాహనదారుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నారు. భాగ్య నగర వాసులు ఎవరూ మోసపోవద్దని హైదరాబాద్ సీపీ ట్విట్టర్ వేదికగా పలు సూచనలు చేశారు.
మోసం ఎలా జరుగుతుందంటే?
బాధితులకు ముందుగా మొబైల్కు ఒక ఎస్ఎంఎస్ (SMS) లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అందులో ‘మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది, వెంటనే చలానా చెల్లించండి.. లేని పక్షంలో భారీ జరిమానా తప్పదు’ అంటూ హెచ్చరిక ఉంటుంది. ఆ మెసేజ్ కింద ఒక షార్ట్ లింక్ ఉంటుంది. చూడటానికి అది ప్రభుత్వ వెబ్సైట్లాగే కనిపిస్తుంది. కానీ, ఒక్కసారి ఆ లింక్ను క్లిక్ చేయగానే అది నేరుగా ఒక నకిలీ వెబ్సైట్కు తీసుకువెళుతుంది. ఆ వెబ్సైట్ డిజైన్, రంగులు, లోగోలు అన్నీ అచ్చుగుద్దినట్లు ప్రభుత్వ అధికారిక పోర్టల్ను పోలి ఉండటంతో సామాన్యులు అది నిజమని భ్రమపడుతున్నారు.
ఖాతాలు ఖాళీ అవుతున్నాయిలా..?
నకిలీ వెబ్సైట్లోకి ప్రవేశించిన తర్వాత, అక్కడ యూజర్లను పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. ఎప్పుడైతే బాధితులు తమ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు లేదా యూపీఐ (UPI) పిన్ ఎంటర్ చేస్తారో, వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవడమో లేదా సెన్సిటివ్ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లడమో జరుగుతుంది. తదుపరి క్షణాల్లోనే వారి బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మాయమవుతోంది. కొన్ని సందర్భాల్లో కేవలం ఒక్క లింక్ క్లిక్ చేయడం ద్వారా ఫోన్లోని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లు వాళ్ల చేతుల్లోకి తీసుకోగలరు.
పోలీసుల హెచ్చరిక – తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఈ పెరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ కింది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
డొమైన్ తనిఖీ చేయండి: ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు ఎప్పుడూ .gov.in లేదా .nic.in తో ముగుస్తాయి. ప్రైవేట్ లింక్స్ను ఎప్పుడూ నమ్మవద్దు.
మెసేజ్లలో వచ్చే లింక్ల ద్వారా కాకుండా, గూగుల్లో నేరుగా e-challan అని వెతికి అధికారిక సైట్లోకి వెళ్లండి.
లింక్స్పై క్లిక్ చేయొద్దు: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఆఫర్లు లేదా జరిమానాల లింక్స్ను క్లిక్ చేయకూడదు.
యాప్స్ వాడండి: ట్రాఫిక్ చలానాల కోసం అధికారిక పోలీస్ యాప్స్ లేదా పేటీఎం (Paytm) వంటి ధృవీకరించబడిన వాలెట్స్ ద్వారా మాత్రమే వివరాలు చెక్ చేసుకోవడం ఉత్తమం.
సైబర్ మోసానికి గురైన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అవగాహనే ఈ మోసాల నుంచి రక్షించే ఏకైక మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Oil India: ఆయిల్ ఇండియాలో భారీ కొలువులు.. నెలకు రూ. 90,000 వరకు జీతం.. గోల్డెన్ ఛాన్స్!