BC Reservations: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్ట్లో విచారణ జరగనుంది. ఈ విచారణను దృష్టిలో పెట్టుకొని హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్న సీఎం.. వాదనలు గట్టిగా వినిపించే అశంపై సమాలోచనలు చేశారు.
హైకోర్టులో వాదనలు వినిపించాలని సింఘ్వీని కోరిన సీఎం..
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న ప్రభుత్వం కోర్టుల్లో కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఈ నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు స్వయంగా హాజరు కావాల్సిందిగా అభిషేక్ సింఘ్వీని ఫోన్లో కోరారు సీఎం. సుప్రీం తీర్పుని ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్రెడ్డికి సూచించినట్టు సమాచారం.
సానుకూలంగా వస్తే ఎన్నికలకు.. ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టుకు..
కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టేయాలని వినతి..
ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో సీపీఐ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన కేసులో తమను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ సీపీఐ తరుపున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తించే జీవో 9ను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడాన్ని సమర్థిస్తూ, దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని, ఆ కేసులో తమను కూడా ప్రతి వాదులుగా చేర్చాలని కోరుతూ సీపీఐ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. ఇప్పటికే విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు సహా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో సీపీఐ సంపూర్ణంగా మద్దతు పలికింది.
Also Read: దారుణం.. కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
బీసీ బిల్లుపై హైకోర్ట్లో 10 ఇంప్లీడ్ పిటిషన్లు..
ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా హైకోర్టులో వరుసగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీసీ ఉద్యమనేతలు ఆర్ కృష్ణయ్య, గుజ్జ సత్యం. మాజీ ఐఏఎస్ చిరంజీవులు, కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, ఇందిరా శోభన్ సహా మొత్తం 10 వరకు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా వీటిని దాఖలు చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతున్నారు.
నేడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ..
బీసీ రిజర్వేషన్లపై దాఖలైన 28 ఇంప్లీడ్ పిటిషన్లు
అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న హైకోర్టు pic.twitter.com/Xlhl4H0WiM
— BIG TV Breaking News (@bigtvtelugu) October 8, 2025