Weather Report : రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేలా ఎండ మండుతుందనేది సామెత. కానీ, ఈసారి సామెతలే తారుమారు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వానాకాలంలోనైనా ఇలా వర్షం కురుస్తుందో లేదో కానీ.. మూడు రోజులుగా డైలీ రెయిన్. అంతా అల్పపీడనం ఎఫెక్ట్. అంతలోనే నైరుతి సైతం నేనొచ్చేశా అంటూ ఉరుముతోంది. అల్పపీడనం, రుతుపవనం.. రెండూ కలిసి వానలు రాగాలు తీస్తున్నాయి. రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. వానలు ఇంకెన్ని రోజులు? ఎప్పుడు తగ్గుతాయి?
5 రోజులు.. నాన్స్టాప్..
రాబోయే ఐదు రోజుల్లో.. వానలు దంచుడే దంచుడంటూ వెదర్ రిపోర్ట్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడుతోంది. 24 గంటల్లో వాయుగుండంగా మారబోతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు జాగ్రత్తగా ఉండాలని.. అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయిన హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో కుమ్ముడే..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాటి ప్రభావంతో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్. వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ రిలీజ్ అయింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
సౌత్ ఇండియా మునకే..
అటు, దేశవ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. మే 28 నుంచి జూన్ 2 వరకు దక్షిణ భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడతాయి. కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో భారీ వానలు పడతాయని స్పష్టం చేసింది.
దేశమంతా వర్షాలు..
కశ్మీర్ నుంచి గోవా వరకు.. గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు.. జూన్ 2 వరకు దేశ వ్యాప్తంగా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఉత్తరాదికి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని.. వానలు బాగా పడతాయని తెలిపింది.
సీఎం రేవంత్ అలర్ట్
తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు చర్యలు తీసుకోవాలని.. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రేటర్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు సీఎం.