Kaleshwaram Report: స్వేచ్ఛ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే నెల 8న తుది తీర్పును వెలువరిస్తామని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణకు పీ.సీ.ఘోష్ కమిషన్ ను నియమించింది. విస్తృత స్థాయిలో విచారణ జరిపిన కమిషన్ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చింది. కాగా, ఈ నివేదికను కొట్టి వేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై హైకోర్టులో గురువారం కూడా విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది దామా శేషాద్రి నాయుడు కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao)లను లక్ష్యంగా చేసుకుని ఈ నివేదికను తయారు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరిపై దుష్ప్రచారం చేనశారని చెప్పారు. పిల్లర్లు కూలిపోయాయని కమిషన్ ను నియమించిన ప్రభుత్వం ఇదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు తాగునీరు సరఫరాకు ప్రణాళికను రూపొందించిందని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లను తీసుకొచ్చేలా జీవో కూడా విడుదల చేసిందన్నారు. ఊహించని వర్షాలతో వచ్చిన భారీ వరదల వల్ల మేడిగడ్డ బ్యారేజీలోని ఒక పిల్లర్ మాత్రమే స్వల్పంగా కుంగిపోయిందన్నారు. నిజానికి ఈ బ్యారేజీ నిర్మాణం కోసం మొత్తం 220 పిల్లర్లను కట్టినట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
Also Read: Indian Railways Checks: రైళ్లలో మద్యం, గుట్కా అమ్మకాలు.. షాకిచ్చిన రైల్వే అధికారులు!
నిపుణుల సలహాలు, సూచనలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతంగా తీసుకున్న నిర్ణయాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. కేబినెట్లో ఆమోదం తీసుకోకుండానే కొన్ని పనులు పూర్తి చేశారని చెప్పారు. అధికారులు కూడా వాస్తవంగా తాము నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తించ లేదన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ ప్రకారం నోటీసు ఇవ్వలేదని పేర్కొనటం సమంజసం కాదన్నారు. అందరికీ నోటీసులు ఇచ్చే కమిషన్ విచారించినట్టు తెలిపారు. నోటీసుల్లో సెక్షన్ ను పేర్కొనంత మాత్రాన కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టాన్నిఉల్లంఘించారనటం సమంజసం కాదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పును ఏప్రిల్ 8వ తేదీకి రిజర్వ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
Also Read: Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో అక్రమ దందా.. ఎంక్వైరీలో వెలువడిన సంచలనాలు..?