Telangana : తెలంగాణలో రెండురోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్టోగ్రతలు భారీగా పెరుగుతాయని ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్లో భానుడి భగభగలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణశాఖ ప్రకటించింది. భాగ్యనగరంలో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం తెలిపింది. సోమవారం రాష్ట్రంలో ఎండలు దంచేశాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.
మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.