Secunderabad: సికింద్రాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే మోండా మార్కెట్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ప్రముఖ వాణిజ్య దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మార్కెట్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
దట్టమైన పొగలు.. భయాందోళనలో ప్రజలు
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు దగ్ధం కావడంతో భారీగా నల్లటి పొగ వెలువడింది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు, వినియోగదారులు ఒక్కసారిగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కళ్లు మండుతుండటం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో జనం భయంతో పరుగులు తీశారు. స్థానిక నివాసితులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రద్దీగా ఉండే ఇరుకైన సందులు కావడంతో ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లడానికి కొంత సమయం పట్టింది. ప్రస్తుతం ఫైర్ అధికారులు యుద్ధప్రతిపాదికన మంటలను అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ ఆస్తి నష్టం
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతున్నప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు మార్కెట్ వైపు వచ్చే దారులను మూసివేసి ట్రాఫిక్ను మళ్లించారు. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.
ALSO READ: Adi Srinivas: కేటీఆర్.. సీఎం రేవంత్ దెబ్బకు నీ మైండ్ బ్లాంక్ అయింది.. ఆది శ్రీనివాస్ ధ్వజం