Kalvakuntla Kavitha: సామాజిక తెలంగాణ సాధన దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, ప్రజా ఆకాంక్షల కోసం పనిచేసే పార్టీ అవసరమని భావిస్తున్న ఉద్యమకారులు, వివిధ సంఘాల నేతలు కవితకు బాసటగా నిలిచారు. మంగళవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ‘జై కవితక్క’ అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.
కవితకు సంఘీభావం తెలిపేందుకు వివిధ వర్గాల ప్రజలు పోటెత్తారు. సింగరేణి కార్మికులు, హెచ్ఎంఎస్ (HMS), ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, బీసీ సంఘాలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి నేతలు, తొలి మరియు మలి దశ ఉద్యమకారుల జేఏసీలు, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి, ఆటో యూనియన్లు, మహిళా సంఘాల బాధ్యులు కవితను కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా కవితకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
“మీ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయే పార్టీ ద్వారానే తెలంగాణలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని బలంగా నమ్ముతున్నాం. మీ బాటలో మీతో పాటే నడుస్తాం.” అని ఉద్యమకారులు కవితకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి, మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో సాగే తన పోరాటానికి అందరూ సహకరించాలని కోరారు.
Read Also: Kalvakuntla Kavitha: ఉగాదికి వస్తున్నాం.. పార్టీపై కవిత కీలక ప్రకటన