Kidney Transplant: స్వేచ్ఛ బ్యూరో: కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో అసాధ్యంగా భావించిన పనిని సుసాధ్యం చేసినట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నెఫ్రాలజీ వైద్యులు తెలిపారు. మహబూబ్నగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రక్తగ్రూపులు భిన్నంగా ఉన్న దాత-గ్రహీత మధ్య విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించడం వైద్య రంగంలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్లో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో, ఆధునిక ‘ఏబీవో ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్’ పద్ధతిని అనుసరించి వైద్యులు రోగికి కొత్త జీవితం ప్రసాదించారు.
సాధారణంగా రక్తగ్రూప్ సరిపోకపోతే మార్పిడి సాధ్యం కాకపోయినా, ప్రత్యేక చికిత్సా విధానాలతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ జశ్వంత్ మాట్లాడుతూ.. ‘కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో అసాధ్యంగా భావించిన పనిని మేము సుసాధ్యం చేశాం. రక్తగ్రూప్ భిన్నత అడ్డంకి కాదని ఆధునిక వైద్య సాంకేతికత నిరూపించింది’ అని తెలిపారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది ఆశాకిరణంగా నిలుస్తుందని, సరైన వైద్య సలహా , సాంకేతికతతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.