AI Jobs: స్వేచ్ఛ బ్యూరో: ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ )రెండు అంచుల కత్తి వలె వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నదన్నారు. అమెరికా బోస్టన్ సిటీలోని హార్వర్డ్ విశ్వ విద్యాలయంలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కృత్రిమ మేధస్సు సదస్సుపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ మోడ్ లో ప్రసంగించారు. గతంలో పారిశ్రామిక విప్లవం మనిషి శారీరక శ్రమను భర్తీ చేస్తే, ఏఐ ఇప్పుడు మనిషి ఆలోచనా శక్తిని, మేధస్సును సవాల్ చేస్తోందని పేర్కొన్నారు. ఏఐ వలన ప్రారంభ స్థాయి ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉన్నదన్నారు . అయితే ఏఐతో డాక్టర్లు, అడ్వకేట్స్,ఆర్కిటెక్టులు, రచయితల పనివిధానంలో మార్పులు వస్తాయని, కానీ పూర్తిగా తొలగించడం కష్టమేనని వివరించారు.
గ్లోబల్ ఇన్నోవేషన్కు కొత్త అడ్రస్
తమ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ’లో భాగంగా ఒక ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సెంటర్ అని, ఫార్మా, సాప్ట్ వేర్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరో స్పేస్, ఢిఫెన్స్, రిటైల్ రంగాలకు గ్లోబల్ కేంద్రంగా ఉన్నట్లు సీఎం చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్త ఏఐ సంస్థలకు వన్-స్టాప్ డెస్టినేషన్గా మారుతుందని తెలిపారు.
ఏఐ కంపెనీలపై ‘పీపుల్ క్రెడిట్స్’ పన్ను
కాలుష్య కారక పరిశ్రమలకు కార్బన్ క్రెడిట్స్ ఉన్నట్లే, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారిని ఆదుకునేందుకు ఏఐ సంస్థలపై ‘పీపుల్ క్రెడిట్స్’ పన్ను విధించే ఆలోచన చేస్తున్నట్లు సీఎం సంచలన ప్రతిపాదన చేశారు. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలు సమాజానికి బాధ్యత వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏర్పడే ఏఐ డేటా సెంటర్లను పర్యావరణహితంగా గ్రీన్ ఎనర్జీతో నడిపిస్తామని పేర్కొన్నారు.
వైట్ కాలర్కు ఏఐ ముప్పు… బ్లూ కాలర్ ఉద్యోగాలపై ప్రభుత్వ ఫోకస్
మరోవైపు వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఏఐ భర్తీ చేయలేని బ్లూ కాలర్ ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. పర్యాటకం, ఎలక్ట్రిక్ వాహనాలు, సస్టైనబిలిటీ , మౌలిక సదుపాయాల రంగాలపై యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రీ-స్కిల్లింగ్ అందించేందుకు హార్వర్డ్ వంటి గ్లోబల్ వర్సిటీలు భాగస్వామ్యం కల్పించాలన్నారు. మరోవైపు తెలంగాణ ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీలకు నిలయమని, మిగిలిన కంపెనీలు కూడా హైదరాబాద్కు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, నైతికమైన ఏఐ పాలన కోసం ఈ సదస్సు ఒక దిశానిర్దేశం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు.
Also Read:జోజిలాలో మృత్యు మంచు.. 15 వాహనాలు సమాధి.. ఏడుగురు బలి!