హైదరాబాద్ నగరంలోని ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకు పౌరసరఫరాల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ఆటో ఎల్పీజీ సరఫరాను మెరుగుపరిచేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శఎం. స్టీఫెన్ రవీంద్ర సోమవారం కీలక సమీక్ష నిర్వహించారు. వారం రోజుల క్రితం జరిగిన సమావేశానికి ప్రస్తుత పురోగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో అనేక బంకులు మూతపడటంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరా గొలుసులో ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ను సేకరించి బంకులకు చేరవేయాలని కంపెనీలను ఆయన ఆదేశించారు.
గడిచిన వారం రోజుల్లో ప్రైవేట్ కంపెనీలు సానుకూల ఫలితాలు సాధించడం పట్ల కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడు రోజుల్లోనే వివిధ కంపెనీలు 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని సేకరించి పంపిణీ చేశాయి. సరఫరా లేక మూతపడిన 17 అవుట్ లెట్లను తిరిగి ప్రారంభించడం విశేషం. ఈ దిశగా చురుకైన పాత్ర పోషించిన సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ ఫ్యూయల్ సంస్థలను ఆయన అభినందించారు. ఇతర సంస్థలు కూడా ఇదే వేగంతో పని చేయాలని సూచించారు. ఆశించిన స్థాయిలో పురోగతి చూపని కొన్ని కంపెనీలపై స్టీఫెన్ రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంస్థలు తమ సరఫరా నెట్వర్క్ను తక్షణమే బలోపేతం చేసుకోవాలని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ కొరత రాకుండా చూడాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగరంలోని అన్ని అవుట్లెట్లలో నిరంతరాయంగా ఇంధనం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ప్రతిరోజూ బంకుల పనితీరును, గ్యాస్ నిల్వలను పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం హైదరాబాద్పై పడకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు లేదా ఆటో డ్రైవర్లకు ఇంధన లభ్యతలో ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఆటో ఎల్పీజీ కొరతను పూర్తిగా రూపుమాపే వరకు శాఖ అప్రమత్తంగా ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.
ALSO READ: అంకెల్లో తెలంగాణ జోరు.. అప్పుల్లో కేరళ తీరు, పినరయి విజయన్కు సీఎం రేవంత్ కౌంటర్