హైదరాబాద్ నగరంలోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కలకలం సృష్టించింది. పండుగ పూట ఒక వృద్ధురాలు తన కూతురి ఇంటికి వెళ్లిన సమయాన్ని అదునుగా చూసుకున్న దుండగులు ఆమె ఇంట్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం బేగంపేటలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ వద్ద ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. నిన్న మహాశివరాత్రి కావడంతో పండుగ జరుపుకోవడానికి అలాగే జాగారం చేయడానికి ఆమె తన కూతురి ఇంటికి వెళ్లారు.
శుక్రవారం ఉదయం ఆమె తిరిగి తన ఫ్లాట్కు చేరుకోగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి షాక్కు గురయ్యారు. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచి ఉంచిన సుమారు 30 తులాల బంగారు నగలు, 2 కేజీల వెండి వస్తువులు మాయమయ్యాయి. వీటితో పాటు బీరువాలో ఉన్న 50 వేల రూపాయల నగదును కూడా దొంగలు దోచుకెళ్లారు. బాధితురాలు వెంటనే ఈ విషయంపై బేగంపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. అపార్ట్మెంట్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ వెనుక ప్రొఫెషనల్ దొంగల హస్తం ఉందా లేక తెలిసిన వారే ఎవరైనా ఈ పనికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పండుగ సమయంలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.