Constable Controversy: స్వేచ్ఛ బ్యూరో: ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి కారణం పై అధికారుల వేధింపులే అని ఆరోపించాడు. ఈ మేరకు ఆ కానిస్టేబుల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, కానిస్టేబుల్ ఆరోపణల్లో నిజం లేదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్లో యాదగిరి కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తనపై వేధింపులకు పాల్పడ్డ కొందరు పై అధికారులు విధుల్లో నుంచి సస్పెండ్ కూడా చేయించారని యాదగిరి ఆరోపించారు.
సీపీ కూడా సరైన విచారణ జరుపకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విషం సేవించాడు. అయితే, సీపీ సజ్జనార్ ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. సరైన కారణం లేకుండా యాదగిరి తరచూ రోల్ కాల్స్కు గైర్హాజరు అయితున్నట్టు తెలిపారు. డ్యూటీ సమయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రెస్ట్ రూమ్లో నిద్రపోతున్నాడని పేర్కొన్నారు. కనీసం యూనిఫామ్ నిబంధనలు కూడా పాటించడం లేదన్నారు. కౌన్సెలింగ్ కోసం స్టేషన్కు వచ్చే బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన విషయం పై అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా యాదగిరి తన తీరును మార్చుకోలేదన్నారు. క్రమశిక్షణా రాహిత్యం, విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యానికి గాను శనివారం యాదగిరిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
Also Read: Medak Murder: మెదక్ జిల్లాలో కిరాతకం.. బట్టలు ఆరేసే తీగకు కరెంటు పెట్టి హత్య, కానీ…
సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్న తర్వాత ఆయన ఆత్మహత్య అంటూ డ్రామాకు తెరతీశారన్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో వాట్సాప్, మీడియా గ్రూపుల్లో ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసి కేవలం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని అధికారులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసినపుడు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ యాదగిరిని అప్పటి ఎస్హెచ్ఓ అతన్ని మొబైల్ డ్యూటీ నుంచి తప్పించినట్టు తెలిపారు. అప్పుడు కూడా ఇలాగే సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పెట్టాడన్నారు. అప్పడు యాదగిరి సస్పెండ్ అయినట్టు తెలిపారు.
మొఘల్పురా పోలీస్ స్టేషన్లో పనిచేసినపుడు కూడా గ్రూపులు కట్టి ఎస్హెచ్ఓను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడన్నారు. బోరబండ ఔట్పోస్ట్లో పనిచేసినప్పుడు కూడా ఆయన అవినీతి కార్యకలాపాలతో స్థానికులను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలిపారు. స్థానిక చిరు వ్యాపారులు, బెల్ట్ షాపులు, వైన్ షాపుల నిర్వాహకుల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. పదేపదే ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటం, అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే యాదగిరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. దీనిని వక్రీకరిస్తూ ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Also Read: Hydraa: త్వరలో హైడ్రా కు మరిన్ని పవర్స్..!