Hydraa: స్వేచ్ఛ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా దాదాపు 20 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఎంచుకున్న సంకల్పం మేరకు ఇప్పటి వరకు ఓఆర్ఆర్ పరిధిలో సుమారు 13 వేల 500 ఎకరాల ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూమిని కాపాడింది. దీని విలువ దాదాపు రూ. 70 వేల కోట్ల వరకు ఉండవచ్చునన్న అంఛనాలున్నాయి. హైడ్రా ఏర్పాటైన తర్వాత కబ్జాలు, ఆక్రమణల తొలగింపుపై ప్రజల్లో విశ్వాసం పెరగటంతో సర్కారు త్వరలోనే అమల్లోకి తేవాలని భావిస్తున్న కోర్ అర్బన్ రీజియన్ ( క్యూర్) చట్టంలో హైడ్రాకు మరింత ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఆక్రమణలకు సంబంధించి సిటీలో జీహెచ్ఎంసీ(GHMC), శివార్లలో రెవెన్యూ విభాగాలున్నా, ఈ విభాగాలకు ప్రజావాణిలో వందలు, వేల సంఖ్యలో ఫిర్యాదులొచ్చినా, ఏ నాడు కూడా సాహాసోపతమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లేవు. హైడ్రా కూడా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో స్వీకరించే ఫిర్యాదులపై అధ్యయనం చేసి, ఫిర్యాదుల వాస్తవమేనా? అన్న విషయాన్ని నిర్థారించుకున్న తర్వాత ఫీల్డు లెవెల్ పర్యటనలు నిర్వహించి, కబ్జాలు ఆక్రమణలను నిర్థారించుకున్న వెంటనే యాక్షన్ చేపడుతూ ప్రజల ఆదరాభిమాలను పొందింది. అందుకే త్వరలో అమల్లోకి తేవాలని భావిస్తున్న క్యూర్ చట్టంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి బాధ్యతలను హైడ్రాకే అప్పగించేలా నిబంధనలు పొందుపర్చనున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలకు, కబ్జాలకు నోటీసులిచ్చి నేరుగా హైడ్రానే నేలమట్టం చేసేలా కఠినమైన నిబంధనలను సర్కారు క్యూర్ చట్టంలో తీసుకురానున్నట్లు చర్చ జరుగుతుంది.
ముఖ్యంగా చెరువుల నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు 69 శాతం చెరువులు కబ్జాల పాలై కనుమరుగైపోయినట్లు హైడ్రా గుర్తించింది. వీటిని గుర్తించి, పునరుద్దరించాలంటే సిటీలో ప్రస్తుతమున్న పట్టణీకరణ జరగకముందు నాలుగైదు దశాబ్దాల క్రితం నాటి ఎన్ఆర్ఎస్సీ డేటా అవసరమన్న విషయాన్ని గుర్తించిన హైడ్రా ఇందుకు వీలుగా 1970, 1990 నాటి డేటా ఆధారంగానే ఇప్పటి వరకు పాతబస్తీలోని భమృకున్ ఉద్దౌలా, కూకట్ పల్లి నల్ల చెరువు, అంబర్ పేటలోని బతుకమ్మ కుంట చెరువులను పునరుద్దరించింది. హైడ్రా ఇప్పటికే మొదటి దశలో ఆరు చెరువుల అభివృద్ది, పునరుద్దరణ బాధ్యతలు తీసుకున్న హైడ్రా రెండో దశగా మరో 14 చెరువులను పునరుద్దరించేందుకు సిద్దమైన సంగతి తెల్సిందే. ఈ రకంగా చెరువు పరిరక్షణ, టెక్నికల్ గా కబ్జాలను నిర్థారించే పనిలో హైడ్రా ముందు ఉండటంతో మున్ముందు ఔటర్ పరిధిలోని మొత్తం చెరువుల పునరుద్దరణతో పాటు నిర్వహణ బాధ్యతలను కూడా హైడ్రాకే అప్పగించేలా సర్కారు క్యూర్ చట్టంలో నిబంధనలను తీసుకురానున్నట్లు తెలిసింది.
Also Read: RCB Fan: సన్ రైజర్స్ చేతిలో RCB ఓడితే, చార్మినార్ పై నుంచి దూకేస్తా !
హైదరాబాద్ నగరంలో ఇటీవలే తరుచూ అగ్ని ప్రమాదాలు జరిగి భారీగా ప్రాణ నష్టం జరిగిన ఘటనలున్నాయి. ఇలాంటి ఘటనలు మున్ముందు పునరావృతం కాకుండా ఉండేలా కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకే ఫైర్ సేఫ్టీ మెజర్స్ అప్పగించేలా కూడా క్యూర్ చట్టంలో ఖచ్చితమైన నిబంధనలు తీసుకురావాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. కబ్జాలపై ఉక్కుపాదం, చెరువుల పునరుద్దరణ విషయంలో సర్కారు హైడ్రాకు పుల్ పవర్స్ కేటాయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని అగ్ని ప్రమాదాల నివారణను కట్టుదిట్టంగా అమలు చేసేలా హైడ్రా, జీహెచ్ఎంసీల మధ్య సమన్వయాన్ని పెంపొందించేలా చట్టంలో నిబంధనలు రానున్నట్లు తెలిసింది.
క్యూర్ చట్టాన్ని త్వరలో జరగనున్న బడ్జెట్ ఆసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపేందుకు సర్కారు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు అక్రమ నిర్మాణాలను కట్టడి చేసే బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించేలా సర్కారు నిర్ణయం ఉండనున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే, దాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అక్రమ నిర్మాణమని నిర్థారించిన తర్వాత లీగల్ సమస్యలు రాకుండా వెంటనే కూల్చివేసే పవర్ కూడా హైడ్రాకు అప్పగించే దిశగా క్యూర్ చట్టంలోని నిబంధనలను రూపొందించనున్నట్లు తెలిసింది.